YS Viveka Assets : వివేకా ఆస్తులు జనవరిలో బదలాయించారా?

తాజాగా వివేకానందరెడ్డి ఆస్తులు ఈ ఏడాది జనవరిలో ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతకు ట్రాన్స్ ఫర్ అయినట్టు ప్రచారం జోరుగా సాగుతోంది.

Written By: Dharma, Updated On : April 29, 2023 12:36 pm
Follow us on

YS Viveka Assets : వివేకా హత్యకేసులో సీబీఐ దూకుడుగా ముందుకెళుతున్న వేళ రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఒక్క రాజకీయ కోణంలోనే వివేకా హత్య జరగలేదని.. దాని వెనుక ఆర్థికపరమై కారణాలున్నాయంటూ ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ కేవలం ఒక్క కోణంలోనే దర్యాప్తు చేస్తోందని కేసులో అనుమానితులు, నిందితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు రెండో భార్య షమీమ్ సైతం సీబీఐ ముందుకొచ్చి కీలక వాంగ్మూలం ఇచ్చారు. చివరి రోజుల్లో వివేకా ఆర్థికంగా ఇబ్బందులు పడేవారని.. అందుకే ల్యాండ్ షటిల్మెంట్లు చేసేవారని సమాచారం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అంటే ఈ లెక్కన ఆయన ఆస్తులు అప్పటికే కుటుంబసభ్యులకు రాసిచ్చేశారని తెలుస్తోంది. అయితే తాజాగా వివేకానందరెడ్డి ఆస్తులు ఈ ఏడాది జనవరిలో ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతకు ట్రాన్స్ ఫర్ అయినట్టు ప్రచారం జోరుగా సాగుతోంది.

మొత్తం 89.83 ఎకరాలు…
పులివెందులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వివేకా పేరిట ఉన్న భూములు తల్లీ కుమార్తెలకు ఈ ఏడాది జనవరిలో దఖలు పడినట్టు టాక్ వినిపిస్తోంది. పులివెందుల మునిసిపాలిటీ రంగాపురం నందు 48.24 ఎకరాలు. ఇక్కడ ఎకరా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లుపై మాటే. సింహాద్రిపురం మండలం రావులకొలనులో 21.49 ఎకరాలు. ఇక్కడ ఎకరా భూమి ధర రూ.15 లక్షల పైమాటే. అదే మండలంలోని నిడివెల్లలో 10.63 ఎకరాలు. ఇక్కడ ధర రూ.20 లక్షలు. తెలికి గ్రామంలో 9.47 ఎకరాలు. ఇక్కడ ఎకరా భూమి రూ.15 లక్షలు. ఇలా మొత్తం 89.83 ఎకరాల భూమి వివేకా భార్య, కుమార్తెల పేరిట ఈ ఏడాది జనవరిలోనే బదలాయించినట్టు తెలుస్తోంది.

కుటుంబానిది వేరే వాదన..
మరోవైపు వివేకా తన ఆస్తిపాస్తులను ఏనాడో కుమార్తె సునీతకు రాసిచ్చారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇటీవల మీడియా ముందుకొచ్చిన షర్మిళ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. వివేకా చనిపోయిన తరువాత ఆయనపై లేనిపోని ఆరోపణలు రావడం దారుణమన్నారు. ఆస్తి కోసం అయితే ఈ హత్య జరగలేదని షర్మిల స్పష్టం చేశారు. ఆస్తులన్నీ ఆయన కూతురు సునీత పేరు మీద ఉన్నాయని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. వైఎస్ వివేకా..వ్యక్తిగత జీవితం గురించి ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. వివేకానంద ప్రజల మనిషని.. ఆయనకు పదవులపై రాజకీయంపై ఎలాంటి ఆశలు లేవని తెలిపారు. సాధారణ జీవితం గడిపే వ్యక్తి అని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా సునీత పేరిట భూములు బదలాయించారని తెలుస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.

రెండో భార్య ఏం చెప్పారంటే..
పోనీ వివేకా రెండో భార్య షమీమ్ వాంగ్మూలమంటూ మీడియాలో ప్రచారం హోరెత్తించారు. వివేకా హత్య జరిగిన ముందు నాటికే ఆయన ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండేవారని చెప్పుకొచ్చారు. ఆయన చెక్ బుక్కులను సైతం లాగేసుకున్నారని ఆరోపించారు. అంటే అస్తిపాస్తులతో పాటు బ్యాంకు లావాదేవీలను సైతం నియంత్రించారని అర్ధమైంది. షమీమ్ వాంగ్మూలంను పరిగణలోకి తీసుకున్నా.. అప్పటికే ఆస్తులన్నీ కుటుంబసభ్యులు టేకోవర్ చేసినట్టు అర్ధమైంది. అటువంటప్పుడు ఈ ఏడాది జనవరిలో భూ బదలాయింపులు జరిగాయని చెబుతున్న విషయంలో ఎంత వాస్తవం ఉందో చూడాలి మరీ.