YS Vijayamma: జగనా.. షర్మిలనా.. వైయస్ విజయమ్మ ఎటు వైపు?

ఇటీవల జగన్ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపాలపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు వైఎస్ విజయమ్మ స్వయంగా హాజరై జగన్ ను ఆశీర్వదించారు.

Written By: Dharma, Updated On : April 4, 2024 11:51 am

YS Vijayamma

Follow us on

YS Vijayamma: వైఎస్ విజయమ్మ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కుమారుడి వైపు ఉండాలా?కుమార్తె వైపు ఉండాలన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఆ ఇద్దరూ తనకు రెండు కళ్ళు అని గతంలోనే ఆమె చెప్పుకొచ్చారు. అందుకే ఇద్దరినీ ఆశీర్వదిస్తున్నారు. ఆప్యాయతను పంచుతున్నారు. కానీ ఏ తల్లికి అలాంటి పరిస్థితి రాకూడదు. రాజశేఖర్ రెడ్డి బతికున్నంత వరకు ఆమె సాధారణ గృహిణి. ఏనాడైతే ఆయన చనిపోయారో.. అప్పటినుంచి పిల్లల రాజకీయ ఉన్నతి కోసం బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ప్రత్యర్థులుగా మారడంతో ఎవరి వైపు ఉండాలో తెలియక సతమతమవుతున్నారు.

అన్న జగన్ ను విభేదించి తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టారు. ఆ సమయంలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా వైఎస్ విజయమ్మ ఉన్నారు. ఏపీలో తన కుమారుడు అధికారంలోకి రావడం, తెలంగాణలో షర్మిల అదృష్టాన్ని పరీక్షించుకోవడం దైవసంకల్పంగా భావించారు. అప్పుడున్న పరిస్థితుల్లో షర్మిలకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. వైసిపి గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు అదే షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం.. సోదరుడిని ప్రత్యర్థి గా భావించి టార్గెట్ చేయడం.. అటు వైసీపీ సైతం షర్మిలకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తుండడం..అవి పతాక స్థాయికి చేరడంతో విజయమ్మ ఎటువైపు నిలుస్తారు అన్నది ప్రశ్నర్ధకంగా మారింది.

ఇటీవల జగన్ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపాలపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు వైఎస్ విజయమ్మ స్వయంగా హాజరై జగన్ ను ఆశీర్వదించారు. ఆత్మీయతను పంచి వెన్ను తట్టి ప్రోత్సహించారు. అయితే అక్కడికి కొద్ది రోజులకే షర్మిల కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాతో ఇడుపాల పాయకు వెళ్లారు. ఆమె వెంట ప్రత్యేక విమానంలో విజయమ్మ కూడా వచ్చారు.అక్కడే షర్మిల తాను ఎందుకు కడప నుంచి పోటీ చేస్తోంది.. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డికి మరోసారి జగన్ టికెట్ ఇచ్చారని తప్పు పట్టారు. జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విజయమ్మ సమక్షంలోనే ఆరోపించారు. తనకు ఎంపీ సీటు ఇవ్వాలని కోరినందునే వివేకానంద రెడ్డిని హత్య చేశారని కూడా చెప్పుకొచ్చారు. అయితే విజయమ్మ సమక్షంలోనే షర్మిల ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

అయితే పిల్లలిద్దరి విషయంలో విజయమ్మ ఓ రకమైన ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆమె షర్మిల వెంట ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. కానీ జగన్ వివేకానంద రెడ్డి హత్య నిందితులను వెనుకేసుకు రావడం విజయమ్మకు సైతం ఇష్టం లేదని.. కానీ కుమారుడిని వదులుకునేందుకు ఆమె మనసు అంగీకరించడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాజశేఖర్ రెడ్డి బతికున్నంత వరకు రాజకీయాల జోలికి వెళ్లే అవకాశం ఆమెకు కలగలేదు. కానీ పిల్లలిద్దరికీ పొలిటికల్ లైఫ్ ఇవ్వాలన్న ఆలోచనతో ఆమె బయటకు వచ్చారు. ఇప్పుడు పిల్లలు ఇద్దరు ప్రత్యర్థులుగా మారడంతో.. ఎవరి వైపు ఉండాలో తెలియక.. బ్యాలెన్స్ గా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ పరిణామ క్రమంలో రాజశేఖర్ రెడ్డి కుటుంబ చరిత్ర మసకబారుతుండడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.