Homeఆంధ్రప్రదేశ్‌YS Sunitha: తండ్రి చావుపై తనయ పోరాటం.. మళ్లీ మొదలు పెట్టిన వైఎస్ సునీత

YS Sunitha: తండ్రి చావుపై తనయ పోరాటం.. మళ్లీ మొదలు పెట్టిన వైఎస్ సునీత

YS Sunitha: వైఎస్ వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య కేసులో ఆయన కుమార్తె సునీత అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ కేసులో అసలు నిందితులు తప్పించుకున్నారని.. వారికి శిక్ష పడాలని ఆమె కోరుతున్నారు. ఇందుకు ఆమె ఎక్కని కోర్టుమెట్లు లేవు. కానీ ఆమె భావిస్తున్నట్లు జరగడం లేదు. కలగని ఆమె అలసిపోవడం లేదు. అసలైన దోషులను బయటకు తీసుకురావాలన్న పట్టుదలతో గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆమె న్యాయ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. సిబిఐ దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తాజాగా మరోసారి కోర్టు మెట్లు ఎక్కడం విశేషం. 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. దాదాపు ఏడేళ్లుగా ఆమె తన తండ్రి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలన్న ఆలోచనతో న్యాయపోరాటం చేస్తున్నారు.

* విచారణ తీరుపై అనుమానం..
ప్రధానంగా సిబిఐ( Central Bureau of Investigation ) విచారణ విషయంలో ఆమె సంతృప్తిగా లేరు. దర్యాప్తు నామమాత్రంగా ముగించారని భావిస్తున్నారు. ఇటీవల సిబిఐ ప్రత్యేక కోర్టులో సమర్పించిన మూడో చార్జ్ షీట్లో కొత్తగా ఎలాంటి ఆధారాలు చూపించలేక పోయింది సిబిఐ. పైగా కొత్త నిందితులు ఎవరూ లేరని తేల్చడం పై సునీత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబిఐ దర్యాప్తు కేవలం కాల్ డేటా రికార్డుల విశ్లేషణకే పరిమితం అయిందని.. అసలు సూత్రధారులను వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సమగ్ర విచారణ కోరుతూ ఆమె ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కొన్ని అంశాలపై దర్యాప్తు చేసేందుకు ముందుకు వచ్చింది. కానీ చార్జిషీట్లో ఎటువంటి ఆధారాలు దొరకలేదని చెప్పడంపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు.

* వాటిపైనే ఆమె అసంతృప్తి..
వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు జరిగిన ఫోన్ సంభాషణలు, అర్ధరాత్రి జరిగిన సందేశాల విషయంలో సిబిఐ ఇచ్చిన వివరణలను ఆమె తప్పు పడుతున్నారు. సమయం నమోదు విషయంలో టెక్నికల్ ఇబ్బందులు జరిగాయని చెబుతూ సిబిఐ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని.. బాహ్య శక్తుల ఒత్తిడి వల్లే దర్యాప్తు ఆగిపోయిందని ఆమె భావిస్తున్నారు. ఇది పక్కాగా రాజకీయ కుట్ర అని.. ఈ హత్య వెనుక ఉన్న అసలైన కుట్రను బయటపెట్టాలని ఆమె కోరుతున్నారు. కేవలం పాత్రధారులను మాత్రమే సిబిఐ గుర్తించగలిగిందని… అసలు సూత్రధారులను వదిలేసిందని ఆమె భావిస్తున్నారు. తన తండ్రి హత్య జరిగిన నాటి నుంచి తాను లేవనెత్తుతున్న ఒక్క అంశానికి కూడా తనకు సరైన జవాబు దొరకడం లేదన్నది సునీత వాదన. అందుకే ఆమె అవిశ్రాంతంగా న్యాయపోరాటం చేస్తున్నారు. మరి ఆమె పోరాటం ఫలిస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular