Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Podili Tour : జగన్ ఎక్కడికెళ్లినా ఎందుకింత జనం, కూటమి సీరియస్ గా...

YS Jagan Podili Tour : జగన్ ఎక్కడికెళ్లినా ఎందుకింత జనం, కూటమి సీరియస్ గా చూస్తుందా? లేదా లైట్ గానా…

YS Jagan Podili Tour : వైసిపి చరిత్రలో ఇది అత్యంత దారుణమైన ఓటమి. వాస్తవానికి ఈ స్థాయిలో సీట్లు వస్తాయని ఎవరూ ఊహించలేదు. శాసనసభ ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత వైసీపీలో ఒకప్పుడు కీలక నాయకులుగా పనిచేసిన వారు మొత్తం పార్టీని వదిలి వెళ్ళిపోయారు. ఈ సమయంలో జగన్ ఇబ్బంది పడతారని.. పార్టీని నిర్వహించడంలో విఫలమవుతారని ప్రచారం జరిగింది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డిని సొంత కుటుంబ సభ్యులు కూడా వదిలి వెళ్ళిపోయారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పదవులను అనుభవించిన వారు మొత్తం దూరంగా వెళ్లిపోయారు. దీనికి తోడు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలను కూటమి ప్రభుత్వం తవ్వడం మొదలుపెట్టింది. అందులో అరెస్టుల పర్వానికి కూడా శ్రీకారం చుట్టింది. ఇప్పటికే చాలామంది నాయకులను జైలుకు పంపించింది. కొంతమంది నాయకులు బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ.. ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇక నాడు అడ్డగోలుగా విమర్శలు చేసిన వారు మొత్తం జైలు పాలయ్యారు. ఇక మద్యం విధానాన్ని కూటమి ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో జగన్ అరెస్టు అయ్యే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్థాయిలో ప్రతిబంధకాలు ఎదురవుతున్నప్పటికీ జగన్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది. అంతేకాదు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఆయన ధైర్యంగా ప్రశ్నిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

గురువారం ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పొదిలిలో పర్యటించారు. అక్కడ పొగాకు రైతుల సమస్యలను తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడారు.. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఆయన ఎండగట్టారు. పొగాకు రైతులను ఆదుకోవాలని.. తక్షణమే పొగాకు కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యార్డులో తిరుగుతూ పొగాకు రైతుల సమస్యలను జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు. ఆ తర్వాత పొదిలి సెంటర్లో తనను చూడడానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మళ్లీ అధికారంలోకి వస్తామని.. అప్పుడు తన పరిపాలన వేరే విధంగా ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వచ్చారు.. ఈ క్రమంలో ఆయనను చూడడానికి భారీగా ప్రజలు వచ్చారు. ఇందులో వైసిపి నాయకులు.. జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నారు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి బయటకి వస్తే చాలు ప్రజలు భారీగా వస్తున్నారు. ఆయనను చూడటానికి పోటీ పడుతున్నారు. పొదిలి పర్యటనలోనూ జగన్మోహన్ రెడ్డి ని చూడటానికి భారీగా ప్రజలు రావడం విశేషం..” జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు భారీగా వస్తారు. 2014లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార నిర్వహించినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చారు. కాకపోతే అప్పుడు ఆయన పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఇక 2019లో జగన్మోహన్ రెడ్డి మాటలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు. ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు. వచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకొని ప్రజలకు పథకాలను అందించారు. అయితే 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆయన కలత చెందడం లేదు. పైగా ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల కూడా ఆయన మీద నమ్మకం ఉంచుతున్నారు. ఆయన ప్రజల్లోకి రాగానే ఘన స్వాగతం లభిస్తోంది. దానికి పొదిలి పర్యటన ఒక ఉదాహరణ మాత్రమేనని” వైసిపి నాయకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వచ్చిన వారంతా స్వచ్ఛందంగా వచ్చిన వారిని.. వారికోసం ఎటువంటి తాయిలాలు ఎర వెయ్యలేదని వైసిపి నాయకులు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు పొదిలిలో జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ప్రజలు వెళ్తున్న దృశ్యాలను వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలలో పంచుకుంటున్నారు వైసిపి నాయకులు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఎక్కడికి వెళ్లినా భారీగా ప్రజలు వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుందా.. లేదా ఇదంతా మామూలే అని వదిలేస్తుందా.. అనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version