Sakshi Media  : సాక్షి’ బాధ్యతల నుంచి భారతి తప్పుకున్నారా? ఆ కథనం వెనుక కథేంటి?

సాక్షి మీడియా ఎవరిదంటే చిన్నపిల్లడైనా చెప్పేస్తాడు. అది వైయస్ కుటుంబానికి చెందినదని అందరికీ తెలుసు. కానీ జగన్ తనకు ఏ మీడియా బలం లేదని చెప్పుకొస్తారు. అటు సాక్షి మీడియా బాధ్యతలు చూసుకునే భారతి సైతం ఇప్పుడు.. సాక్షి అంటే తెలియదన్నట్టు వ్యవహరిస్తుండటం విశేషం.

Written By: Dharma, Updated On : September 20, 2024 12:02 pm

Shakshi Media

Follow us on

Sakshi Media : గత వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ చిన్న వైఫల్యం వెలుగు చూసినా దానిపై విచారణకు ఆదేశిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల క్యాబినెట్ భేటీ జరిగింది. గత ఐదేళ్లలో ప్రకటనల రూపంలో సాక్షికి వందల కోట్ల రూపాయలు చెల్లించడం,గత రెండేళ్లలో సాక్షి పేపర్ కొనుగోలుకు 205 కోట్ల రూపాయలు కేటాయించడం చర్చకి వచ్చింది.దీనిపై విచారణ చేపట్టాలని మంత్రులు కోరారు.ఇప్పటికే జగన్ విషయంలో చంద్రబాబు ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సాక్షి విషయంలో క్విడ్ ప్రో జరిగినట్లు భావిస్తున్నారు. దీనిపై విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.సరిగ్గా ఇదే సమయంలో సాక్షి చైర్ పర్సన్ గా ఉన్న జగన్ సతీమణి భారతికి..సాక్షి మీడియాతో అస్సలు సంబంధం లేదని ప్రత్యేక కథనం రావడం విశేషం.

* తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని
2004లో అధికారంలోకి వచ్చారు రాజశేఖర్ రెడ్డి.అప్పుడే ఈనాడు, ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా కథనాలు రాశాయి. ఆ సమయంలో సొంత పత్రిక, మీడియా ఉండాలని రాజశేఖర్ రెడ్డి భావించారు.అప్పుడే జగన్ ఇందిరా మీడియా పేరిట సాక్షి పత్రికతో పాటు ఛానల్ ను ఏర్పాటు చేశారు.ఈనాడు, ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా సాక్షి మీడియాను అభివృద్ధి చేశారు. అయితే వైయస్సార్ అకాల మరణంతో జగన్ ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇబ్బందులు ఎదురైనా మీడియాను నడుపుకుంటూ వచ్చారు. అయితే గత ఐదేళ్లలో సాక్షి మీడియా తనది కాదన్నట్టు వ్యవహరించారు.తనకు మీడియా సపోర్ట్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

* ప్రకటనల రూపంలో 440 కోట్ల రూపాయలు
గత ఐదేళ్లలో ప్రభుత్వ ప్రకటనల్లో సాక్షిదే సింహభాగం. ప్రభుత్వ ప్రకటనల రూపంలో సాక్షికి 440 కోట్ల రూపాయలు కేటాయించడం విస్తు గొలుపుతోంది. గత రెండేళ్లుగా వాలంటీర్లు,సచివాలయాల కు సాక్షి పత్రిక సర్క్యులేట్ అవుతోంది. దీనికి గాను ప్రభుత్వ ఖజానా నుంచి సాక్షి యాజమాన్యానికి 204 కోట్ల రూపాయలు జమ అయినట్లు తెలుస్తోంది.ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం, పాలన వ్యవహారాలను వాలంటీర్లతో పాటు సచివాలయ ఉద్యోగులకు.. తెలియజెప్పాలన్న రీతిలో ప్రత్యేక జీవో తీసుకువచ్చారు. సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచడంతో పాటు నేరుగా ప్రభుత్వం నుంచి ఆ సొమ్మును భర్తీ చేశారు.

* కూటమి ప్రభుత్వం ఫోకస్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పత్రికకు 600 కోట్ల రూపాయలను అడ్డగోలుగా దోచిపెట్టిన విషయం బయటపడింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఇదే చర్చకు వచ్చింది. దీంతో మంత్రుల సూచన మేరకు చంద్రబాబు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఒక్కసారి పత్రికకు 403 కోట్ల రూపాయలు ప్రకటనలు ఇవ్వగా.. ఇతర 20 పత్రికలకు 488 కోట్లను కేటాయించినట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సాక్షితో వైయస్ భారతికి ఎటువంటి సంబంధం లేదని సాక్షిలో కథనం రావడం విశేషం. సాక్షికి చైర్ పర్సన్ కానీ.. కనీసం డైరెక్టర్ కానీ ఆమె కారని అర్థం వచ్చేలా ఈ కథనం ఉండడంతో రకరకాల అనుమానాలకు తావిస్తోంది. వైయస్ భారతి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అన్న అనుమానం కలుగుతోంది.