YCP tough revenge on Janga Krishnamurthy
Janga Krishnamurthy: జంగా కృష్ణమూర్తిని వైసీపీ వెంటాడుతోంది. టిడిపిలో చేరడంతో ఆయన వద్ద ఉన్న ఎమ్మెల్సీ పదవి పై వేటు వేసింది. పార్టీ ఫిరాయించారని ఆరోపిస్తూ అనర్హత వేటు వేసింది. ఆయనను అనర్హుడిగా ప్రకటించింది శాసనమండలి. ఈ మేరకు చైర్మన్ కొయ్య మోషన్ రాజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.వైసిపి ఆవిర్భావం నుంచి కృష్ణమూర్తి ఆ పార్టీలో కొనసాగారు.బలమైన బీసీ నాయకుడు కూడా. ఆ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా పనిచేశారు.
2011లో వైసిపి ఆవిర్భవించిన సమయంలో జగన్ వెంట నడిచిన నాయకుల్లో జంగా కృష్ణమూర్తి ఒకరు. పార్టీ పట్ల నిబద్ధత, నిజాయితీతో రాజకీయాలు చేశారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా పార్టీ విజయానికి కృషి చేశారు. గురజాలలో కాసు మహేష్ రెడ్డి గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నించారు. రాజ్యసభ పదవితో పాటు టీటీడీ చైర్మన్ పదవి జంగా కృష్ణమూర్తికి వరిస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఎమ్మెల్సీతో సరిపెట్టారు. ఎన్నికల్లో గురజాల టికెట్ ఆశించారు కృష్ణమూర్తి. కానీ జగన్ నో చెప్పారు. తిరిగి కాసు మహేష్ రెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో మనస్థాపానికి గురైన కృష్ణమూర్తితెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి అభ్యర్థి విజయానికి కృషి చేశారు. ఇది తట్టుకోలేని వైసీపీ జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు వేయించింది.
కొద్దిరోజుల క్రిందట జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు వేయాలని విప్ లేళ్ల అప్పిరెడ్డి ఇదివరకే ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై తాజాగా శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు స్పందించారు. కృష్ణమూర్తి పై అనర్హత వేటు వేస్తూ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఒక పార్టీ టికెట్ పై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడితే… పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు పడుతుంది. వైసిపి ఆవిర్భావం నుంచి సేవలు అందించిన జంగాపైఆ పార్టీ గట్టిగానే రివెంజ్ తీర్చుకుంది.