YSR Congress Party: ఏపీలో( Andhra Pradesh) పోలీస్ శాఖ అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లెక్కచేయడం లేదు. ఇటీవల పోలీస్ స్టేషన్లకు వెళ్లి మరీ పోలీస్ అధికారులతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. వారు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఏకంగా చొక్కాలు పట్టుకునే విధంగా వారు ప్రవర్తిస్తున్నారు. అయితే పోలీసుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు వ్యూహాత్మకమని అర్థమవుతోంది. క్షేత్రస్థాయిలో పోలీసుల మనో ధైర్యాన్ని దెబ్బతీయడం ద్వారా.. వైసిపి క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఈ ప్రయత్నం అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా పోలీసులను రెచ్చగొట్టి దాడి చేసేలా చేస్తే తరువాత దానిని రాజకీయంగా మలుచుకోవచ్చు అనేది ఒక ప్రణాళికగా తెలుస్తోంది. పోలీసులంటే భయపడాల్సిన పనిలేదని.. వారిపై ఎదురుదాడికి దిగిన వెనుక తాము ఉన్నామని బలమైన సంకేతాన్ని పార్టీ ముఖ్య నేతలు ఇచ్చే ప్రయత్నం అని ప్రచారంలో ఉంది.
* లెక్క చేయని విధంగా..
అస్సలు పోలీసులంటే లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. వారు ఏదో ఇంకా ఒక్కసారి కూడా అధికారం చేపట్టనట్టు.. తాజాగా రాజకీయాల్లోకి వచ్చినట్టు.. తరువాత తామే అధికారం చేపడతామని ప్రజలు భావిస్తున్నట్టు రెచ్చిపోతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు( EX minister ambati Rambabu), జక్కంపూడి రాజా వంటి నేతలు పోలీసులతో వ్యవహరించిన తీరు వారి వ్యూహానికి తగ్గట్టుగానే ఉంది. అంబటి రాంబాబు అయితే పోలీసుల సమక్షంలోనే సీఎం చంద్రబాబుపై బూతులు మాట్లాడారు అంటే.. పోలీసులంటే లెక్కలేని తనం అన్నట్టు ఉంది. నాని కుమారుడు కిట్టు కూడా బహిరంగంగా పోలీస్ అధికారిని హెచ్చరిస్తూ మాట్లాడారు అంటే పరిస్థితి ఎంత దాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. పోలీస్ వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడడం చూస్తుంటే తమ పార్టీ శ్రేణులకు ఒక రకమైన సంకేతం పంపించినట్టు ఉంది.
* అప్పట్లో ఏకపక్షంగా..
సాధారణంగా అధికార పార్టీకి పోలీస్ శాఖ ( police department)అనుకూలంగా ఉంటుంది అనేది ప్రధాన ఆరోపణ. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అయితే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. కానీ శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం రాజకీయ సిఫార్సులకు పక్కన పెట్టాలని పోలీస్ శాఖకు సూచించింది. అయితే రాజకీయ కోణం లేదని చెప్పలేము కానీ.. చాలావరకు పోలీసులు మధ్యమార్గంగా వెళుతున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పోలీస్ శాఖపై దూకుడుగా వ్యవహరిస్తూ పలుచన చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ దూకుడు వెనుక శాంతి భద్రతలకు విఘాతం కలిగించవచ్చు అన్న ఆలోచన ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
ఏదైనా ప్రభుత్వ శాఖలో అవినీతి జరిగితే ప్రతిపక్షంగా ప్రశ్నించాలి. అందులో ఎంత మాత్రం తప్పులేదు. కానీ ప్రజాస్వామ్యాన్ని, ప్రజలకు రక్షణగా ఉన్న పోలీసులపైనే తిరగబడుతుండడం.. దాడి చేసినంత ప్రయత్నం చేయడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. సమాజానికి రక్షణ కల్పించాల్సిన పోలీసు యంత్రాంగం నిస్సహాయ స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. నేతల ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు, క్యాడర్ కు ఇస్తున్న సంకేతాలు వ్యవస్థలను నిర్వీర్యం చేసే దిశగా సాగుతున్నాయి. ఇది కచ్చితంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రభావం చూపి అవకాశం ఉంది. అయితే 2019 ఎన్నికలకు ముందు టిడిపి పాలనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే మాదిరిగా వ్యవహరించింది. అందుకే ఆ వ్యూహం ఇప్పుడు పని చేయకపోవచ్చు.