YSR Congress Party: ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామం ఒకటి చోటుచేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీగా టిడిపి చెప్తోంది. ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అయితే ఇది పొలిటికల్ గా డ్యామేజ్ చేస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోంది.. అందుకే జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్మీట్లో ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. గొడ్డలి పార్టీతో పాటుగాగన్ కల్చర్ అనేది తెలుగుదేశం పార్టీ పేటెంట్ అంటూ మాట్లాడారు. ఎవరి హయాంలో బాబాయ్ హత్య జరిగిందో చెప్పాలని సవాల్ చేశారు. అంతకుముందు మాజీమంత్రి విడదల రజిని సైతం ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ ప్రశ్నించారు. తమను అనవసరంగా అలా అనవద్దని కూడా హెచ్చరించారు. అయితే ఒక పద్ధతి ప్రకారం టిడిపి నాయకత్వం గొడ్డలిని హైలెట్ చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పిలిచే కంటే గొడ్డలి పార్టీగా ఎలివేట్ అయ్యేలా చేసింది. అయితే ఆ డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి సైతం రంగంలోకి దిగారు. వివరణ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా టిడిపి పై ఎదురుదాడికి దిగారు.
* వచ్చే ఎన్నికల నాటికి సజీవం..
వైయస్ వివేకానంద రెడ్డి హత్య అనేది వచ్చే ఎన్నికల్లో కూడా సజీవంగా నిలుస్తుంది అనేది బహిరంగ రహస్యం. 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. తొలుత గుండెపోటుగా చిత్రీకరించారు వాళ్లే. కాదు కాదు గొడ్డలితో నరికి చంపారు అన్నది వాళ్లే. జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి గొడ్డలి అనే మాట పదే పదే వచ్చింది. అయితే ఆ తర్వాత కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. సొంత కుటుంబ సభ్యులే హత్య చేశారని ఆరోపణలు రావడం.. నిందితులను జగన్మోహన్ రెడ్డి వెనుకేసుకొస్తున్నారని సొంత కుటుంబ సభ్యులు ఆరోపించడం వంటివి ఈ కేసులో హైలైట్ అయ్యాయి. సిబిఐ విచారణను సైతం అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించలేదు కదా.. దర్యాప్తు పై సైతం ప్రభావం చూపిందని ఆరోపణలు వచ్చాయి. వివేకానంద రెడ్డి హత్య అంశం మొన్నటి ఎన్నికల్లో విపరీతమైన ప్రభావం చూపింది. అందుకే ఈ అంశాన్ని సజీవంగా ఉంచి జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టాలని టిడిపి భావిస్తుంది.
* కాదంటున్న జగన్..
గొడ్డలి పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చూపే ప్రయత్నం చేస్తోంది టిడిపి. అయితే తమది గొడ్డలి పార్టీ ఎలా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం విశేషం. వివేకానంద రెడ్డి హత్య జరిగింది టిడిపి సమయంలోనని.. ఆయనను హత్య చేసిన ప్రధాన నిందితుడు ఇప్పుడు టిడిపితో కలిసి పని చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. అయితే చనిపోయింది స్వయానా తన బాబాయ్. కచ్చితంగా నిందితులను శిక్షించాల్సింది ఆయనే. కానీ ఐదు సంవత్సరాలు అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి మాత్రం వివేకా హత్య కేసులో సీరియస్ గా దృష్టి పెట్టినట్టు లేదన్న విమర్శలు వచ్చాయి. పైగా నిందితులను కాపాడారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే గొడ్డలి పార్టీ అనే ముద్ర బలంగా వెళ్తోంది ఆ పార్టీపై.
