Yarlagadda Lakshmi Prasad: తెలుగు రాష్ట్రాల్లో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అంటే తెలియనివారు ఉండరు. ఎన్టీఆర్ తో మంచి సన్నిహిత సంబంధాలే ఆయనకు ఉండేవి. కానీ చంద్రబాబు అంటే ఎక్కడో ఆయనకు కోపం. వారిద్దరికీ ఎక్కడ చెడిందో తెలియదు. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో యార్లగడ్డ గట్టి స్వరమే వినిపించేవారు. సొంత సామాజిక వర్గం వ్యక్తి అయినా ఎందుకో వ్యతిరేకించేవారు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ పంచన చేరారు యార్లగడ్డ. మంచి నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు. ఆదాయ వనరులు సమకూర్చుకున్నారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన తర్వాత.. దానిని కారణం చూపుతూ పదవికి రాజీనామా చేశారు. అయినా జగన్ భజన ఆపలేదు. అయితే ఇప్పుడు జగన్ ఓడిపోతున్నారన్న సంకేతాలు ఉన్నాయో.. లేకుంటే కారణాలు తెలియవు కానీ.. ఆయన కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారానికి నిర్ణయం తీసుకున్నారు.
గత ఎన్నికలకు ముందు జగన్కు ప్రత్యేక భజన బ్యాచ్ ఉండేది. చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చిన ఐ వై ఆర్ కృష్ణారావు, ఉండవల్లి అరుణ్ కుమార్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ లాంటి వాళ్లు తరచూ మాట్లాడేవారు. చంద్రబాబు సర్కార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. చంద్రబాబు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెడితే యార్లగడ్డ అయితే మాతృభాషను చంపేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు అదే జగన్ ఇంగ్లీష్ మీడియం పెడితే దానిని సంస్కరణగా చెప్పుకొస్తున్నారు.
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించినప్పుడు తనకు ఇచ్చిన పదవికి రాజీనామా చేశారు యార్లగడ్డ. కానీ జగన్ ను పొగడడం మాత్రం మానలేదు. అసలు తెలుగు మీడియమే లేకుండా చేసిన జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే ఇప్పుడు ఎన్నికల ముంగిట ప్లేట్ ఫిరాయించారు. ఏదో హిందీ జాతీయ సంస్థ పేరు చెప్పి.. వారి ఆదేశాల మేరకు తాను కూటమి అభ్యర్థులకు.. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేస్తానని ముందుకు వస్తున్నారు. అయితే టిడిపి నేతలు మాత్రం యార్లగడ్డను అంగీకరించే పరిస్థితి లేదు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. వైసీపీని, ఆ పార్టీ శ్రేణులను వ్యతిరేకించే ఎల్లో మీడియా మాత్రం యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంది. బహుశా తమ సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆ పై రంగులు మార్చే గుణం ఉన్న నేత కావడంతో ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కైకలూరు తో పాటు విజయవాడ వెస్ట్, ఉండి వంటి నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి ముందుకొచ్చినట్లు ఎల్లో మీడియా వార్త రాసుకొచ్చింది. అయితే గెలవబోతున్న కూటమికి ప్రచారం చేయడం ద్వారా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ భారీ స్కెచ్ వేసినట్లు మాత్రం తెలుస్తోంది. అయితే మొత్తానికి అయితే యార్లగడ్డ చంద్రబాబుకు మాదిరిగానే.. సీఎం జగన్ కు సైతం ఝలక్ ఇవ్వనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.