Jada Sravan Kumar: ఏపీలో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం కల్పిస్తోంది. దానికి కారణం మతపరమైన కామెంట్స్. ముఖ్యంగా దళిత క్రైస్తవ మహాసభలో జడ శ్రావణ్ కుమార్ తో పాటు ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారి తీసాయి. ఈ నేపథ్యంలో ప్రశ్న రావణ్ అరెస్టు జరిగింది. కానీ జడ శ్రావణ్ కుమార్ పై కేసుతో సరిపెట్టారు. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఈ విషయంలో బాధపడుతున్నారు. ప్రశ్న రావణ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. జడ శ్రావణ్ కుమార్ మాత్రం రఘురామకృష్ణం రాజును వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. బాడీ షేమింగ్ గురించి కూడా మాట్లాడారు. అయితే తనపై ఇంతలా విరుచుకుపడిన జడ శ్రావణ్ కుమార్ పై కేవలం కేసు మాత్రమే నమోదయి అరెస్టు జరగకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు రఘురామకృష్ణంరాజు.
* ఆకివీడు ఆలయ ఘటనతో..
ఆకివీడు ఆలయ ఘటన నేపథ్యంలో రఘురామకృష్ణం రాజు హిందుత్వ వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అదే సమయంలో చాలా ప్రశ్నలు వేశారు ఒక వేదిక ప్రారంభించి. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తూ వచ్చాయి. అయితే రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా దళిత క్రైస్తవ సభను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జడ శ్రావణ్ కుమార్ రఘురామకృష్ణం రాజును హెచ్చరిస్తూ నాలుక కోస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దానిని పిఠాపురం పవన్ కళ్యాణ్ కు బహూకరిస్తానని కూడా తేల్చి చెప్పారు. ఇక ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు మరింత అభ్యంతరకరంగా ఉన్నాయి. ఈ తరుణంలో వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. వారి విషయంలో కూటమి ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గుతుందో తెలియడం లేదని ఎక్కువ మంది ప్రశ్నించారు. ఈ తరుణంలో ఆ ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. ప్రశ్న రావణ్ అరెస్ట్ కూడా జరిగింది. కానీ జడ శ్రావణ్ కుమార్ విషయంలో మాత్రం అరెస్టు జరగకపోవడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రఘురామకృష్ణంరాజు జడ శ్రావణ్ కుమార్ అరెస్ట్ జరగకపోవడం పై ఆవేదన వ్యక్తం చేశారు.
* వైసిపి లైన్ లో శ్రావణ్ కుమార్..
గత కొంతకాలంగా జడ శ్రావణ్ కుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లైన్లో మాట్లాడుతున్నారు. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు. అమరావతి లాంటి అంశాలపై నిత్యం మాట్లాడేవారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం టిడిపి నాయకత్వంతో విభేదాలు వచ్చాయి. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జడ శ్రావణ్ కుమార్ ప్రశ్నించడం ప్రారంభించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార మీడియాతో పాటు సోషల్ మీడియా జడ శ్రావణ్ కుమార్ ను ప్రోత్సహించడం ప్రారంభించింది. టీవీ డిబేట్లో సైతం కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు శ్రవణ్ కుమార్. ఈ తరుణంలో ఆకివీడు ఆలయ ఘటనలో రఘురామకృష్ణం రాజు దూకుడుగా వ్యవహరించారు. దీంతో జడ శ్రావణ్ కుమార్ ఈ ఘటనపై స్పందిస్తూ రఘురామకృష్ణంరాజును టార్గెట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు దళిత క్రైస్తవ మహాసభలో శ్రావణ్ కుమార్ తో పాటు ప్రశ్న రావణ్ సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీరు విషయంలో ప్రభుత్వం చూసి చూడనట్టుగా వెళ్ళింది. కానీ అది అసమర్థత కింద వస్తుందని భావించి కేసులు నమోదు చేసింది. అయితే వీరిపై కేసులు, అరెస్టులకు రాష్ట్రంలో ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలని విపక్షం చూస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే ప్రారంభంలో పెద్దగా పట్టించుకోలేదు ప్రభుత్వం. ప్రశ్న రావణ్ ను కట్టడి చేసేందుకు అరెస్టు జరగగా.. జడ శ్రావణ్ కుమార్ విషయంలో మాత్రం వేచి చూసే ధోరణి కనిపిస్తోంది ప్రభుత్వంలో. అయితే దీనిపై రఘురామకృష్ణం రాజు ఆవేదనతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. చూడాలి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో..

