Vijayasai Reddy
YSR Congress : క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ). ఇటీవలే వైసిపికి గుడ్ బై చెప్పారు. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ పదవితో పాటు వైసీపీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఇకనుంచి వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. తన వద్ద ఉన్న మూడున్నరేళ్ల రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది సాహసమే. జగన్మోహన్ రెడ్డి తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. నంబర్ 2 గా ఎదిగారు. అటు జాతీయస్థాయిలో పరిచయాలు పెంచుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే విజయసాయిరెడ్డి అని గుర్తుకొచ్చేలా ఢిల్లీ రాజకీయాలు నడిపారు. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా తో అత్యంత చనువు పెంచుకున్నారు. అటువంటి నేత ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడం మాత్రం సాధారణ విషయం కాదు. అయితే ఇప్పుడు సాయి రెడ్డి పాత్ర కోసం సరైన నేత కోసం జగన్మోహన్ రెడ్డి ఎదురుచూస్తున్నారు.
* రెండు పదవులు కీలకమే
మొన్నటి వరకు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ( YSR Congress ) సమన్వయకర్త పదవిని చేపట్టారు. అదే సమయంలో రాజ్యసభలో వైసిపి పక్ష నేతగా వ్యవహరించారు. అయితే ఈ రెండు పదవులు కీలకమే. ఒకటి పార్టీ పదవి.. రెండోది జాతీయస్థాయిలో గుర్తింపు, పరపతి దక్కించుకునే పదవి. అందుకే ఈ రెండు పదవులకు వైసీపీలో చాలా గిరాకీ ఉంది. అందుకే ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. విజయసాయిరెడ్డి ప్లేస్ లోకి వచ్చేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజ్యసభలో వైసిపి పక్ష నేత పదవి కోసం మిగిలిన ఏడుగురు పోటీ పడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ప్రయత్నం రాజ్యసభలో( Rajyasabha ) వైసిపి పక్ష నేత పదవి కోసం ప్రధానంగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన క్రమంలో అయోధ్య రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన సైతం వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడిచింది. కానీ తాను పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి విడిచిపెట్టిన వైసీపీ రాజ్యసభ పక్ష నేత పదవి కావాలని ఆయన బలంగా కోరుతున్నారు. అయితే ఆయన పార్టీలో ఉంటారా? ఉండరా? అన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడినట్లు సమాచారం.
* విపరీతమైన పోటీ
మరోవైపు ఉత్తరాంధ్ర( North Andhra) సమన్వయ కర్త పదవి కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల సమన్వయకర్తగా ఉన్నారు. పైగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూడా. ఇంకోవైపు శాసనమండలిలో వైసిపి పక్ష నేతగా ఉన్నారు. అటువంటి నాయకుడిని ఇప్పుడు ఉత్తరాంధ్ర బాధ్యతలు కట్టబెడితే ఇబ్బందికరమని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే సామాజిక సమీకరణలను తెరపైకి తెచ్చి ఉత్తరాంధ్ర బాధ్యతలను పేర్ని నానికి అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే విజయసాయిరెడ్డి స్థానంలోకి వచ్చేందుకు నేతలు పోటీ పడుతుండడం విశేషం.