YS Viveka Case : వివేకా హత్యకేసు.. ఆ ఆరుగురి రిమాండ్ పొడిగింపు

అయితే ప్రస్తుతానికి సీబీఐ ఏ విషయాలను బయటపెట్టడం లేదు. కోర్టు ఇచ్చిన గడువులోగా దర్యాప్తు పూర్తిచేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.  

Written By: Dharma, Updated On : June 17, 2023 11:12 am
Follow us on

YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కొలిక్కి వస్తుందనుకున్న తరుణంలో చాలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసులో అరెస్టయిన ఆరుగురికి ఈ రోజుతో రిమాండ్ ముగిసింది. దీంతో వారు బెయల్ పై ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి రిమాండ్ ను పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలిచ్చింది. హై ప్రొఫైల్ కేసుగా ఉన్నా.. ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతునే ఉన్నాయి. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరైంది. దాదాపు ఆయన అరెస్ట్ ఖాయమనుకుంటున్న తరుణంలో నాటకీయ పరిణామాల మధ్య ముందస్తు బెయిల్ దక్కింది.

మరోవైపు అవినాష్ కు మంజూరైన ముందస్తు బెయిల్ ను రద్దుచేయాలని వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టు తలుపుతట్టారు. కోర్టులో స్వయంగా తన వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన కోర్టు సునీతకు గుడ్ న్యూస్ చెప్పింది. సీబీఐ లాయర్లతో సునీత తరుపు న్యాయవాదులు సమన్వయం చేసుకోవచ్చని కోర్టు సూచించింది. సునీత చెబుతున్నట్టే సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని అవినాష్ రెడ్డి అండ్ కో వాదిస్తున్న తరుణంలో సుప్రీం కోర్టే సీబీఐ పీపీలతో సునీత న్యాయవాదులు కలిసి పనిచేయవచ్చని తీర్పు ఇవ్వడం విశేషం. అయితే అది సుప్రీం కోర్టు నిబంధనలకు లోబడి చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

వివేకా కేసులో ఆరుగురు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇటీవల ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి అరెస్టయిన సంగతి తెలిసిందే.  ఎర్ర గంగిరెడ్డి, శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ్ భాస్కరరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు సీబీఐ అదుపులో ఉన్నారు. భాస్కరరెడ్డితో కలిపి వీరి సంఖ్య ఆరుగురుగా ఉంది. ఈ రోజుతో వీరికి రిమాండ్ ముగిసింది. దీంతో సీబీఐ కోర్టు వీరి రిమాండ్ గడువును మరోసారి పొడిగించింది. దీంతో వీరి బెయిల్ ఆశలు నీరుగారిపోయాయి.

ప్రస్తుతానికి సీబీఐ గుంభనంగా వ్యవహరిస్తోంది. మరోవైపు కేసు ముగించేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు సమీపిస్తోంది. అటు అవినాష్ బెయిల్ పై సునీత గట్టిగానే పోరాడుతున్నారు. సీబీఐతో కలిసి పనిచేసేందుకు కోర్టు అనుమతివ్వడంతో ఆమె మరింత స్పీడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి సీబీఐ ఏ విషయాలను బయటపెట్టడం లేదు. కోర్టు ఇచ్చిన గడువులోగా దర్యాప్తు పూర్తిచేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.