Vijayasai Reddy Liquor Scam: ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది. గురువారం ఉదయం హైదరాబాద్, ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఈడి అధికారులు తనిఖీలు చేశారు. మద్యం కుంభకోణంలో సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి, ఆయనకు సహకరించిన ఇతర నిందితుల ఇళ్లు, కార్యాలయాలే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నానక్ రామ్ గూడ లోని ఏక్తా హైలాండ్ అపార్ట్మెంట్ లో ఉన్న రాజ్ కసిరెడ్డి నివాసంలో ఈడి బృందాలు లోతుగా తనిఖీలు చేపట్టాయి. మొన్ననే విజయసాయిరెడ్డి ఏడు గంటల పాటు విచారణ సాగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో. ఆయన ఇచ్చిన సమాచారంతోనే ఇప్పుడు ఈడీ సోదాలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఒక్క రాజ్ కసిరెడ్డి మాత్రమే కాదు.. ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎంపీ వాసుదేవ రెడ్డి నివాసంతో పాటు కోకాపేటలోని ఆయన బంధువుల ఇళ్లు, ఆ సిండికేట్ లో మధ్యవర్తులుగా వ్యవహరించిన వల్లు సందీప్, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వంటి మొత్తం ఆరుగురు నిందితుల ఆస్తులపై దాడులు జరిగాయి.
* వైసిపి హయాంలో భారీ కుంభకోణం..
వైసిపి ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానించింది. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో సుమారు రూ.3500 కోట్ల పక్కదారి పట్టిందన్న ఆరోపణలు పై.. ఇప్పటికే ఈడి రూ.441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. గతంలో కూడా ఈడి పలుమార్లు విస్తృత సోదాలు జరిపింది. విజయసాయిరెడ్డిని ఏడు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు ఈడీ అధికారులు. అయితే తనకు ఈ స్కాంతో ఎలాంటి సంబంధాలు లేవని.. ఈ కుంభకోణానికి సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తోనే ఇప్పుడు ఈడి రంగంలోకి దిగింది. విస్తృత తనిఖీలు చేపట్టింది.
* సమాంతరంగా విచారణలు..
మద్యం కుంభకోణానికి సంబంధించి ఒకవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పిఎ నాగేశ్వర్ రెడ్డి ఇంట్లో కూడా భారీగా ఆస్తుల దృవపత్రాలతో పాటు అక్రమ నగదును గుర్తించింది. అయితే దానికి సమాంతరంగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఒకవైపు ఏపీ దర్యాప్తు సంస్థ.. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ ఏకకాలంలో విచారణ చేపడుతున్నాయి మద్యం కుంభకోణం కేసులో. అయితే విచారణ జరుగుతున్న కొలది అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కూడా ఓ కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణానికి అవసరం అయిన సమాచారం ఇస్తానంటూ చెప్పుకొచ్చారు. అటు తరువాతనే మద్యం కుంభకోణం కేసులో అరెస్టులు మొదలయ్యాయి. ఇప్పుడు రెండోసారి ఈ డి విచారణతో నిందితుల ఇళ్లపై దాడులు చేసి తనిఖీలు చేస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రముఖంగా నిలుస్తుండడం విశేషం.

