Vangaveeti Radha Krishna: వంగవీటి రాధాకృష్ణకు( vangaveeti Radha Krishna ) మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. త్వరలో ఆయనకు పదవి ఖాయమని ప్రచారం సాగుతోంది. నిన్ననే చంద్రబాబు పిలుపుమేరకు ఆయనను ప్రత్యేకంగా కలిశారు రాధాకృష్ణ. కొద్దిసేపు వారిద్దరి మధ్య సమావేశం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత రాధాకృష్ణ ఎంతో ఉత్సాహంతో కనిపించారు. చంద్రబాబు పిలిచి మరి శుభవార్త చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. కానీ ఎంతవరకు వంగవీటి రాధాకృష్ణకు ఎటువంటి నామినేటెడ్ పదవి దక్కలేదు. ఎమ్మెల్సీ తో పాటు రాజ్యసభ పదవుల ఎంపిక సమయంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. చివరి నిమిషంలో మాత్రం పేరు లేకుండా పోయేది. దీంతో వంగవీటి అభిమానుల్లో ఒక రకమైన ఆవేదన కనిపించేది. అయితే ఇప్పుడు చంద్రబాబు నేరుగా పిలిచి మాట్లాడారు. పదవి పై ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
* రాజకీయ నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేక..
వంగవీటి మోహన్ రంగా( Mohan Ranga) కుమారుడిగా కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రాధాకృష్ణ. కానీ రాజకీయంగా కొన్ని నిర్ణయాలు ఆయన పాలిట శాపంగా మారాయి. 2004లో రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన రాధా చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి చేతులు కాల్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో ఆశించిన టికెట్ దక్కకపోవడంతో ఎన్నికలకు ముందు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరి ప్రచారం చేశారు. కానీ ఆ పార్టీ ఓడిపోయింది. ఐదేళ్లపాటు అదే పార్టీలో కొనసాగారు. మొన్నటి ఎన్నికల్లో సైతం కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా రాధాకు ఇంతవరకు పదవి దక్కలేదు. దీంతో అనుచరుల్లో అసంతృప్తి ఉంది. ఇటువంటి తరుణంలో సీఎం చంద్రబాబు పిలిచి మాట్లాడడంతో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.
* ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ..
త్వరలో భారీగా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒక పదవి రాధాకృష్ణకు ఇస్తారని ప్రచారం నడుస్తోంది. కేవలం ఎమ్మెల్సీ గానే కాకుండా క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో రాధాకృష్ణ సేవలు వినియోగించుకోవాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. రాజ్యసభ పదవికి ఎంపిక చేసిన ఆశ్చర్యపోనవసరం లేదన్న టాక్ ఉంది. చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడడం వెనుక పెద్ద స్కెచ్ ఉందన్న అనుమానాలు ఉన్నాయి. మళ్లీ కాపులను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని భావిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. దానికి విరుగుడుగా ఇప్పుడు రాధాకృష్ణకు రాజ్యసభ పదవి ఇచ్చి చంద్రబాబు చెక్ పెడతారన్న టాక్ కూడా ఉంది. మొత్తానికైతే సీఎం చంద్రబాబు పిలిచి మాట్లాడడంతో రాధాకృష్ణకు తప్పకుండా ఒక పదవి ఉంటుందన్న అంచనాకు వచ్చారు అభిమానులు. చూడాలి మరి ఏం జరుగుతుందో..