Vallabhaneni Vamsi Health: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ( Vallabha Nene Vamsi Mohan ) మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సమస్య తలెత్తడంతో ఆయనను హుటాహుటిన కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంకిపాడు ఆసుపత్రికి వంశీ భార్య పంకజశ్రీ, మాజీమంత్రి పేర్ని నాని చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం పై కుటుంబ సభ్యులు ఆందోళనతో ఉన్నారు. వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తక్షణం ఎయిమ్స్ కు తరలించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. వరుస కేసులలో చిక్కుకున్న వల్లభనేని వంశీ మోహన్ రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 100 రోజులకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఒక కేసులో బెయిల్ వస్తుంటే మరో కేసులో ఆయనకు రిమాండ్ కొనసాగుతోంది. మొన్న ఆ మధ్యన అస్వస్థతకు గురికావడంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత తిరిగి జైలుకు తరలించారు.
* అస్వస్థతకు గురి కావడంతో..
ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ మోహన్. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయనను పోలీసులు వెంటనే కంకిపాడు లోని ప్రభుత్వ ఆసుపత్రికి( kankipadu government hospital) తరలించారు. విషయం తెలుసుకున్న వంశీ సతీమణి పంకజశ్రీ, వైసిపి జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. వంశి ఆరోగ్య పరిస్థితులపై పేర్ని నాని వైద్యులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. వంశి ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున ఎయిమ్స్ కు తరలించాలని పోలీసులకు పేర్ని నాని డిమాండ్ చేశారు. వంశీ కుటుంబ సభ్యులు సైతం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల కిందట శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో న్యాయ అధికారికి వంశీ విజ్ఞప్తి చేశారు. దీంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
* వరుసగా రిమాండ్లు.
వల్లభనేని వంశీ మోహన్ పై ఇప్పటివరకు ఏడు కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 13న హైదరాబాదులో వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి, అక్కడ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ లభించలేదు. విచారణల అనంతరం సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి రిమాండ్ విధించింది కోర్టు. ఆ రిమాండ్ లో ఉండగానే వల్లభనేని వంశీ మోహన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం కంకిపాడు ఆసుపత్రిలోనే ఆయన వైద్య సేవలు పొందుతున్నారు.
* టిడిపి ద్వారా ఎంట్రీ..
వల్లభనేని వంశీ మోహన్ తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అప్పటినుంచి నిత్యం చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ఈ ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి దారుణ పరాజయం చవి చూశారు. అప్పటినుంచి నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వరుస కేసులు పెట్టి వల్లభనేని వంశీని జైల్లో పెట్టింది. అయితే వంశీ అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.