TTD: సాక్షికి షాక్ ఇచ్చిన టీటీడీ.. ఇలా ఫిర్యాదు.. అలా ఎఫ్ఐఆర్!.

ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ శ్రేణులు సైలెంట్ అయ్యాయి.కానీ ఆ పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తోంది సాక్షి మీడియా. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన, అధికారులతో సమీక్షలపై వరుస కథనాలు ప్రచురిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ నుంచి వచ్చిన ఫిర్యాదుతో సాక్షి యాజమాన్యంపై పోలీసు కేసు నమోదయింది.

Written By: Dharma, Updated On : October 8, 2024 12:17 pm

TTD(1)

Follow us on

TTD: తిరుమల లడ్డు వివాదం నేపథ్యం వేళ సాక్షి యాజమాన్యం పై ఒక కేసు నమోదు అయ్యింది. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సాక్షిలో ప్రత్యేక కథనం రావడంతో టీటీడీ అధికారులు స్పందించారు. సాక్షి యాజమాన్యం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాక్షిపై కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఈ అంశం పొలిటికల్ సర్కిల్లో సంచలనం రేకెత్తించింది.సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నుంచి ఇద్దరు అధికారులను, రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి ఇద్దరు అధికారులను, ఆహార కల్తీ నియంత్రణ శాఖ నుంచి ఒక అధికారిని నియమిస్తూ సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. సిట్ విచారణపై బహిరంగంగా ఎవరూ మాట్లాడవద్దని.. అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సాక్షి ఓ కథనాన్ని ఇటీవల ప్రచురించింది. సీఎం చంద్రబాబు దంపతులు తిరుమలను సందర్శించిన సంగతి తెలిసిందే. స్వామివారికి పట్టు వస్త్రాలు సైతం సమర్పించారు. ఈ సందర్భంగా తిరుమలలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. అటు టీటీడీ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షలు జరిపారు. లడ్డు వివాదం దృష్ట్యా కీలక ఆదేశాలు జారీ చేశారు. లడ్డు ప్రసాదం తయారీ నుంచి భక్తుల సౌకర్యాల వరకు కీలక సూచనలు చేశారు. అయితే దీనిపై సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు కానున్న సిట్ ఎదుట.. అప్పటి వైసిపి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా చెప్పాలని.. అంతా తాను చూసుకుంటానని.. ఇప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా మేనేజ్ చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు సాక్షిలో కథనం వచ్చింది. ఇది టీటీడీ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ.. సాక్షిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ అధికారులు.

* అసత్య కథనాలని ఫిర్యాదు
టీటీడీ అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడిన విషయాలను పక్కనపెట్టి.. అసత్య కథనాలతో శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూసాక్షి పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తిరుమలలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందించారు.ఈ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద సాక్షి యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

* ప్రభుత్వం సీరియస్
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇటీవల సీఎం చంద్రబాబు తిరుమలను సందర్శించారు. భార్య భువనేశ్వరితో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు చంద్రబాబు. టీటీడీలోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని.. ప్రతి భక్తుడు సంతృప్తి కలిగేలా సేవలు అందించాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే టీటీడీ లడ్డు వివాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులకు లేనిపోనివి చెప్పారని.. అప్పటి వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకోవాలని సూచించారని సాక్షిలో కథనం వచ్చింది. అందుకే ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. అనని మాటలను వక్రీకరించి కథనం ప్రచురించడం పై అటు టీటీడీ వర్గాలు సైతం సీరియస్ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేయడం, కేసు నమోదు కావడం జరిగిపోయింది. మరి తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాలి మరి. దీనిపై సాక్షి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.