Shock  to YCP :  ఒకే రోజు మూడు షాక్ లు.. వైసీపీలో అసలేం జరుగుతోంది? ఎందుకీ పరిస్థితి?

ఓటమి నుంచి వైసీపీ తప్పకుండా గుణపాఠాలు నేర్చుకోవాలి. ముఖ్యంగా వైసీపీలో ఉండేది ఎవరో? వెళ్లిపోయేది ఎవరో? తేల్చుకోవాలి. కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. ఆ తరువాత పోరాటం ప్రారంభిస్తే.. సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

Written By: Dharma, Updated On : August 8, 2024 2:50 pm
Follow us on

Shock  to YCP : ఈ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకుంటోంది. అయితే ఆ పార్టీకి షాక్ లు తప్పడం లేదు. నిన్న ఒక్కరోజే మూడు ఘటనలు ఆ పార్టీని దారుణంగా దెబ్బతీశాయి. పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. 2019లో 151 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అద్భుత విజయం సాధించింది. దేశాన్ని తన వైపు చూసుకునేలా చేసింది. కానీ ఐదేళ్లు తిరిగేసరికి దానికి మించి ఓటమితో మరోసారి దేశంలో చర్చనీయాంశంగా మారింది. కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకుంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. భారీ ఓటమితో పార్టీలో వైఫల్యాలు సైతం బయటపడుతున్నాయి. ఇక పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలంతా వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. ఓటమి ఎదురైన వెంటనే విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కేశినేని నాని క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధా రాఘవరావు పార్టీకి రాజీనామా చేశారు. సినీ నటుడు అలీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటన చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన మద్దాలి గిరి, కిలారి రోశయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరకపోయినా వైసీపీకి దూరమయ్యారు. అయితే ఫలితాలు వచ్చిన వెంటనే సీనియర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జూనియర్లు అస్సలు మాట్లాడడం మానేశారు.

*:స్థానిక ప్రజాప్రతినిధులు గుడ్ బై
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రతినిధులు వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ నగరపాలక సంస్థ నుంచి కార్పొరేటర్లు టిడిపి, జనసేనలోకి క్యూ కట్టారు. ఇటువంటి తరుణంలో విశాఖ స్థాయి సంఘ ఎన్నికలు జరిగాయి. పదికి పది స్థానాలను టిడిపి కూటమి అభ్యర్థులు దక్కించుకున్నారు. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముందు వైసీపీకి గట్టి షాక్ తగిలింది.

* పెండ్యం దొరబాబు రాజీనామా
పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు పిఠాపురం నియోజకవర్గం నుంచి. 2019 ఎన్నికల్లో ఇదే సీటు నుంచి గెలిచారు పెండ్యం దొరబాబు. కానీ పవన్ పోటీ చేసేసరికి దొరబాబును పక్కన పెట్టారు. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను తెరపైకి తెచ్చారు. అయితే ఐదేళ్లు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉంటూ పార్టీ కోసం కష్టపడితే తనను పక్కన పెట్టడాన్ని దొరబాబు జీర్ణించుకోలేకపోయారు. అయితే ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో వైసీపీలోనే కొనసాగారు. అయితే ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు దొరబాబు. నిన్ననే పార్టీకి రాజీనామా చేశారు. దొరబాబు తో పాటు మరికొంతమంది వైసీపీలో వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఇది రెండో షాక్.

* అనంతపురం జిల్లా అధ్యక్షుడు అదే బాటలో
అనంతపురం జిల్లాలో వైసీపీ తుడుచుపెట్టుకుపోయింది. కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. ఈ తరుణంలో అక్కడ పార్టీకి అండగా నిలిచేవారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య పార్టీకి గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత కారణాలతో తాను పార్టీని వీడుతున్నట్లు చెబుతున్నా.. వేరే పార్టీలో చేరేందుకే ఆయన రాజీనామా బాట పట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి తేరుకుంటున్న తరుణంలో.. ఇలా నేతలు పార్టీ నుంచి బయటకు రావడం, స్థానిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం వైసిపికి షాకింగ్ ఇచ్చే పరిణామాలే.