Janasena : జనసేన క్లీన్ స్వీప్ చేసే ప్రాంతాలు ఇవే

గోదావరి జిల్లాల్లో మెజార్టీ నియోజకవర్గాలు జనసేన ఖాతాలో పడినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీతో కలిస్తే ఆ 34 నియోజకవర్గాలకు వైసీపీ నుంచి విముక్తి ఖాయమని కూడా తేల్చేస్తున్నారు. 

Written By: Dharma, Updated On : June 30, 2023 10:49 am
Follow us on

Janasena :  జనసేన పార్టీలో ఎన్నడూ లేనంత ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.అటు విశ్లేషకులు సైతం అదే అభిప్రాయంతో ఉన్నారు. అధికార పక్షం ఎంత తక్కువ చేసి మాట్లాడినా పవన్ తన పార్టీని మంచి పొజిషన్ లో పెట్టారని విశ్లేషిస్తున్నారు. ప్రజల్లో కూడా విశ్వాసం పెంచుకున్నారని చెప్పుకొస్తున్నారు. తన బలానికి తగ్గట్టుగానే ఆయన మాట్లాడుతున్నారని.. పవన్ కు అంత బలం లేనప్పుడు అధికార పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ చేస్తున్న విమర్శలే పవన్ కు పెరిగిన గ్రాఫ్ ను తెలియజేస్తున్నాయని చెబుతున్నారు.

ఇటీవల వారాహి యాత్రలో పవన్ వైసీపీ విముక్త గోదావరి జిల్లాల కోసం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక పెద్ద కథ ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి విముక్తి కలిగించారని ప్రజలకు పిలుపునిచ్చారే కానీ.. జనసేనను గెలిపించాలని కోరలేదు కదా అని ఎక్కువ మంది లాజిక్ మాట్లాడుతున్నారు. వాస్తవానికి గోదావరి జిల్లా ప్రజలు రాజకీయ చైతన్యాన్ని కోరుకుంటారు. అందునా కాపు సామాజికవర్గం ఎక్కువ. పవన్ లోనే తమ బలమైన ఆకాంక్షను చూసుకుంటున్నారు. ఆపై పవన్ కు ఉన్న క్లీన్ ఇమేజ్. ఇన్ని సానుకూలాంశాలతో పవన్ అంతులేని ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతున్నారు. అందుకే ముందుగా వైసీపీ విముక్త ఏపీ అన్నారు. ఇప్పుడు వైసీపీ విముక్త గోదావరి జిల్లాలకు పిలుపునిచ్చారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాలున్నాయి. రాష్ట్రంలోని ఐదో వంతు నియోజకవర్గాలు ఇక్కడే ఉన్నాయి. టీడీపీతో కలిసి నడిస్తే ఒక్క సీటంటే ఒక్క సీటు కూడా వైసీపీకి రాదన్నదని పవన్ కచ్చితమైన అభిప్రాయం. జనసేన ఒంటరిగా పోటీచేసినా మెజార్టీకి మించి నియోజకవర్గాలను గెలుచుకోవడం ఖాయం. అందుకే పవన్ పట్టుపట్టి మరీ వారాహి యాత్రనే ఇక్కడే నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాలను తన ఆయువు పట్టని సవాల్ చేశారు.

అయితే పవన్ తనకు ఒక చాన్సివ్వాలన్న పిలుపు ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ప్రతి పౌరుడికీ తాకింది. అందుకే వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. వారాహి యాత్రపై విషం చిమ్ముతున్నారు. చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసేందుకే పవన్ గోదావరి జిల్లాల్లో యాత్రకు దిగారని సరికొత్త స్లోగన్ అందుకున్నారు. ఆ భయంలో తెలుస్తోంది జనసేన బలం. ఉభయగోదావరి జిల్లాను స్వీప్ చేస్తారన్న కలవరం కనిపిస్తోంది. గోదావరి జిల్లాల్లో మెజార్టీ నియోజకవర్గాలు జనసేన ఖాతాలో పడినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీతో కలిస్తే ఆ 34 నియోజకవర్గాలకు వైసీపీ నుంచి విముక్తి ఖాయమని కూడా తేల్చేస్తున్నారు.