Madanapalle: ఏమీ తెలియని అమాయకుడిలా వచ్చాడు.. గుడిలోకి వెళ్లి అమ్మవారికి దండం పెట్టుకున్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

మదనపల్లి తమిళనాడుకు సరిహద్దులో ఉంటుంది కాబట్టి.. తమిళ భక్తులు కూడా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు.. భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో.. ఆదాయం కూడా ఈ ఆలయానికి దండిగా రావడం మొదలుపెట్టింది. దీంతో ఈ ఆలయాన్ని నిర్వాహక కమిటీ అభివృద్ధి చేసింది.. భక్తులు ఉండడానికి షెడ్లు, వంట చేసుకోవడానికి రూములు నిర్మించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 10, 2024 5:15 pm

Madanapalle

Follow us on

Madanapalle: అది ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని బుగ్గ కాలువలోని బాట గంగమ్మ ఆలయం. కోరిన కోరికలు నెరవేర్చుతుందని.. నమ్మి మొక్కితే ఎన్ని వరాలైనా ఇస్తుందని.. ఎంతటి బాధలు ఉన్నా.. సాంత్వన కలిగిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ గుడికి ప్రతిరోజు వందలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. కొందరు పొంగళ్ళు వండుతూ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. మరికొందరేమో కోళ్లు, గొర్రెపోతులు, మేకపోతులను బలి ఇచ్చి అమ్మవారికి మొక్కలు తీర్చుకుంటారు. శని – ఆదివారాల్లో అయితే జనం కిటకిటలాడుతుంటారు. పైగా ఆషాడ మాసం, శ్రావణమాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యాలు సమర్పిస్తుంటారు.. కొందరేమో పూనకాలతో అమ్మవారిని కొలుస్తుంటారు.

మదనపల్లి తమిళనాడుకు సరిహద్దులో ఉంటుంది కాబట్టి.. తమిళ భక్తులు కూడా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు.. భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో.. ఆదాయం కూడా ఈ ఆలయానికి దండిగా రావడం మొదలుపెట్టింది. దీంతో ఈ ఆలయాన్ని నిర్వాహక కమిటీ అభివృద్ధి చేసింది.. భక్తులు ఉండడానికి షెడ్లు, వంట చేసుకోవడానికి రూములు నిర్మించింది. ఆషాడం, శ్రావణ మాసాల సమయాలలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.. అయితే ఎంతో విశిష్ట చరిత్ర ఉన్న ఈ ఆలయం ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. సాధారణంగా అమ్మవారి ఉత్సవాల సమయంలో మీడియాలో వార్తలు వస్తుంటాయి. కానీ ఈసారి విభిన్నమైన వార్త ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కనిపించింది. ఇంతకీ ఏం జరిగింది అంటే..

బాట గంగమ్మ ఆలయాన్ని శుక్రవారం రాత్రి ఓ భక్తుడు దర్శించుకున్నాడు. ఆలయం లోపలికి వెళ్లి అమ్మవారికి పూజలు చేశాడు. అమాయకుడి లాగా బొట్టు పెట్టుకున్నాడు. ఆ తర్వాత గుడిలో గంట కొట్టాడు. కొబ్బరికాయ కొట్టి.. అమ్మవారికి నమస్కరించాడు. ఆ తర్వాత అమ్మవారి నగలను తస్కరించాడు. ఆ సమయంలో భక్తులు లేరు. పూజారి కూడా బయట ఉన్నాడు. ఇదే అదునుగా భావించిన అతడు ఆ నగలు తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఈ నగల విలువ ఎంత ఉంటుందనేది తెలియ రాలేదు. అయితే ఆ భక్తుడు దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు మొదలుపెట్టారు. సిసి పుటేజి రికార్డు పరిశీలించి.. దొంగను పట్టుకునే పనిలో పడ్డారు.

ఈ సంఘటన మదనపల్లి పట్టణంలో సంచలనంగా మారింది. ఈ ఆలయంలో ఇంతవరకు ఎటువంటి చోరీ జరగలేదు. పైగా ఈ ఆలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. దొంగతనం జరిగిందన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఆలయానికి పోటెత్తారు. కొందరైతే ఆలయాన్ని శుద్ధి చేశారు. పసుపు నీళ్లు చల్లి మన్నించు తల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నారు. అయితే అమ్మవారి నగలను చోరీ చేసిన ఆ వ్యక్తి గతంలోనూ.. దొంగతనాలకు పాల్పడ్డాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆ గుడి గురించి తెలిసిన వాడు కాబట్టే ఈ చోరీకి పాల్పడ్డాడని అంటున్నారు.