CM Chandrababu : చంద్రబాబు చేసిన పనికి మాజీ సైనికుల ఫిదా!

దేశానికి రక్షణ కల్పించే వాడే సైనికుడు. ఆ సైనికుడికి పదవీ విరమణ తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం వారికోసం ఒక వినూత్న ఆలోచన చేసింది. వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.

Written By: Dharma, Updated On : October 15, 2024 11:52 am

CM Chandrababu

Follow us on

CM Chandrababu :  :ఏపీలో మాజీ సైనిక ఉద్యోగులకు గుడ్ న్యూస్. వారితోపాటు వారి కుటుంబ సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. 10 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ తో దీనిని ఏర్పాటు చేసినట్లు హోం శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మాజీ సైనిక ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు భారీ ఉపశమనం లభించింది. ఏపీలో మాజీ సైనికులు అధికం. వారు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడంతో సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సైన్యంలో పనిచేసే పదవీ విరమణ పొందిన వారికి, సైన్యంలో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, వారిపై ఆధారపడిన వారికి సాయం అందించేందుకు ప్రభుత్వం ఎక్స్ సర్వీస్ మెన్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసింది. అయితే దీనికి ఏకంగా 10 కోట్ల నిధులను కేటాయించడం విశేషం.

* వేలాదిమందికి ప్రయోజనం
ఈ కార్పొరేషన్ ఏర్పాటుతో వేలాదిమందికి ప్రయోజనం కలగనుంది. అయితే ఈ కార్పొరేషన్ ద్వారా సాయం విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై తదుపరి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా మాజీ సైనికులకు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

* వారికి పథకాలు వర్తించవు
మాజీ సైనికులకు, వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు వర్తించవు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల మాదిరిగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని మాజీ సైనికులు కోరుతూ వచ్చారు. ఇదే విషయంపై 2019 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. తాము మరోసారి అధికారంలోకి వస్తే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. ఇప్పుడు టిడిపి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడంతో మాజీ సైనికుల అంశాన్ని పరిశీలించారు చంద్రబాబు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏకంగా 10 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించారు. దీంతో మాజీ సైనిక కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.