Site icon OkTelugu

Chandrababu Emotional Speech: 53 రోజులు జైల్లో పెట్టారు..నాటి చీకటి రోజులను తలుచుకుని చంద్రబాబు భావోద్వేగం

Chandrababu

Chandrababu

Chandrababu Emotional Speech: చంద్రబాబు గుంభనంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే చిత్తాన్ని కోల్పోరు. పైగా ఆయన ధైర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అటువంటి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. మాట్లాడుతూ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుతున్నారు.. ఆ తర్వాత తనకు ఎదురైన అనుభవాన్ని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు సంవత్సరాల జగన్ పరిపాలన కాలంలో పడిన ఇబ్బందులు ఏకరువు పెట్టుకుంటూ పోయారు.

“2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు గురైంది. ఆంధ్రప్రదేశ్ .. తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నాడు రాష్ట్ర విభజనతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది. ఇక 2019 నుంచి 2024 వరకు వైసిపి పరిపాలన కాలంలో ఏపీ రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. జగన్ పరిపాలన కాలంలో వైసీపీ నాయకులు పెట్టుబడిదారులను వేధించారు. వెంటపడి తరిమేశారు. యువత భవిష్యత్తు మీద దెబ్బ కొట్టారు. రాజకీయంగా.. పరిపాలన పరంగా తనకు ఎంతో అనుభవం ఉన్నప్పటికీ.. తనని కూడా 53 రోజులపాటు జైలో పెట్టారని” చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

నాడు జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. అప్పుడు చంద్రబాబు ఉన్న జైల్లో కనీసం సౌకర్యాలు కూడా లేవు. ఆయనకు ఉన్న ప్రత్యేకమైన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కనీసం భోజనం చేయడానికి కూడా వీల్లేకుండా పోయింది. కోర్టు అనుమతులతో చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి భోజనం తెప్పించుకోవలసి వచ్చింది. కరడు కట్టిన దుర్మార్గులు ఉండే బ్యారక్ లో చంద్రబాబును వేశారు. నాడు ఆయన భద్రతపై లోకేష్.. ఇతర కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ చంద్రబాబుకు బెయిల్ లభించలేదు. చివరికి న్యాయస్థానంలో చంద్రబాబు తరఫున లాయర్లు గట్టిగా వాదనలు వినిపించడంతో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఎటువంటి అక్రమాలు జరగని వ్యవహారంలో చంద్రబాబును దోషిగా పేర్కొంటూ నాడు జగన్ ప్రభుత్వం ఆయనను జైల్లో వేసింది. చంద్రబాబు జైలుకు వెళ్లడాన్ని సగటు తెలుగువాళ్లు జీర్ణించుకోలేకపోయారు. అంతేకాదు జగన్ ప్రభుత్వం అత్యంత పైశాచికంగా వ్యవహరించడంతో.. ఏపీ ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు.

ఇక అప్పటినుంచి జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని టిడిపి నేతలు అంటుంటారు. సరిగా నాటి రోజులను గుర్తు చేసుకొని చంద్రబాబు బాధపడ్డారు. అంతేకాదు ఆ చీకటి పాలనను చీల్చుకొని ప్రజాపాలన తెచ్చుకుందామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిని బట్టి ఆ యాభై మూడు రోజులు ఆయన ఏ స్థాయిలో ఇబ్బంది పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాడు జగన్ కక్ష సాధింపు తోనే ఆ స్థాయిలో వ్యవహరించారు. ఫలితంగా 11 సీట్లతో ప్రతిపక్ష స్థానాన్ని కూడా సాధించుకోలేక అభాసు పాలయ్యారు.

Exit mobile version