Deputy CM Pawan Kalyan: కేంద్ర బడ్జెట్లో( Central budget ) ఏపీకి ప్రాధాన్యం దక్కింది. కొన్ని ముఖ్యమైన అంశాల విషయంలో కేంద్రం అభయం ఇచ్చింది. ప్రధానంగా వ్యవసాయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విన్నవించిన ఓ కీలక సమస్యకు పరిష్కార మార్గం చూపింది కేంద్రం.. మొన్న మధ్యన కోనసీమ జిల్లాను పవన్ కళ్యాణ్ సందర్శించారు. అక్కడ పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తానని హామీ ఇచ్చారు. మొన్నటి ఢిల్లీ పర్యటనలో సైతం ఇదే అంశాలను వారికి వివరించారు. దాని ఫలితంగానే కొబ్బరి పంటకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ కేటాయింపుల్లో ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చింది. కొబ్బరి రైతులను ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని.. ఆ దిశగా తన ప్రయత్నాలు చేస్తానని పవన్ కళ్యాణ్ అప్పట్లో రైతులకు హామీ ఇచ్చారు.
కేంద్రం ప్రోత్సాహకాలు..
నిన్ననే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్( Nirmala sitaraman) పార్లమెంటులో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా కీలక రంగాలతో పాటు ప్రాజెక్టులకు నిధులు ప్రకటించారు. మరోవైపు కొబ్బరి ఉత్పత్తిని పెంచడం కోసం కొబ్బరి ప్రోత్సాహక పథకాన్ని తీసుకొచ్చినట్లు బడ్జెట్లో ప్రకటించారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి చెట్ల సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. కాయలు కాయని కొబ్బరి చెట్ల స్థానంలో.. కొత్త చెట్లు ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తారు. కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. రిజర్వాయర్లలో చేపల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నారు. అయితే నెలల కిందటే కొబ్బరి పంటలను పవన్ పరిశీలించడం.. ఆదుకుంటామని హామీ ఇవ్వడం.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన చేయడం చూస్తుంటే పవన్ కృషి స్పష్టంగా కనిపిస్తోంది.
రెండు నెలల కిందట సందర్శన..
గత ఏడాది నవంబర్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి పంటలను పరిశీలించారు పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan). మోడుబారిన చెట్లు, వాలిపోయిన కాయలు, నిస్సహాయంగా చూస్తున్న రైతులు పవన్ కళ్యాణ్ పై ఆశగా ఎదురు చూశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడి రైతుల బాధను వ్యక్తం చేసిన క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అప్పట్లో కొబ్బరి రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. 45 రోజుల్లో శాశ్వత పరిష్కార మార్గాలను చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా ఉప్పునీటి ప్రవేశం, సముద్రపు జలాలు తోటల్లోకి రావడంతో చెట్లు నాశనం అయ్యాయి. అయితే ఇప్పుడు కేంద్రమే రంగంలోకి దిగడం వెనుక పవన్ కృషి ఉన్నట్లు స్పష్టమవుతోంది. పవన్ ఢిల్లీ వెళ్లిన తరువాత ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని స్పష్టం అవుతోంది. అందుకే ఏపీలో రైతులు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.