Pawan Kalyan : జగన్ కు క్లీన్ చీట్ ఇచ్చిన కేంద్రం. ఆ విషయంలో పవన్ ఇరకాటం!

ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నెన్నో విమర్శలు చుట్టుముట్టాయి. విపక్షాలు సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అవి ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ప్రతికూల ఫలితాలు వచ్చాయి.

Written By: Dharma, Updated On : July 31, 2024 12:12 pm
Follow us on

Pawan Kalyan : గత ఐదేళ్ల వైసిపి పాలనపై విరుచుకుపడేవారు పవన్.ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి నుంచి ఆరోపణలు వచ్చినా పెద్దగా ప్రజల్లోకి వెళ్ళేది కావు.కానీ పవన్ వైసీపీ సర్కార్ పై చేసిన ప్రతి ఆరోపణ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.పవన్ తనదైన శైలిలో ప్రభుత్వంపై ఆరోపణలు చేసేవారు. గణాంకాలతో సహా వెల్లడించేవారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేవారు. ముఖ్యంగా వాలంటీర్ల విషయంలో బలమైన ఆరోపణలు చేశారు పవన్.వారితో కుటుంబాల వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్తోందని.. మనుషుల అక్రమ రవాణాకు కారణం అవుతోందని.. ఏపీలో వైసిపి పాలనలో 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారంటూ ఆరోపణలు చేశారు.అప్పట్లో అవి సంచలనం సృష్టించాయి. చర్చకు దారి తీశాయి. జాతీయ స్థాయిలో సైతం హాట్ టాపిక్ గా మారాయి. తనకు కేంద్రం నుంచి సమాచారం ఉందని.. నిఘా వర్గాలు సైతం హెచ్చరించాయని అప్పట్లో పవన్ చెప్పుకొచ్చారు.అయితే దీనిపై వైసీపీ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పవన్ పై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి.అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది.జనసేన భాగస్వామ్యంగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దీనిపై కీలక ప్రకటన చేసింది.పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ లోక్ సభలో దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది కేంద్రం. ఇది ఒక విధంగా చెప్పాలంటే పవన్ కు ఇబ్బందికర పరిణామమే. పెద్ద ఎత్తున మహిళలు అపహరణకు గురవుతున్నారని నాడు పవన్ ఆరోపించారు. కానీ అది తప్పు అని కేంద్రం తాజాగా వెల్లడించడంతో పవన్ ఇరకాటంలో పడ్డారు.

* టిడిపి సభ్యులకు ప్రశ్నలకు సమాధానం
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి.గత ఐదేళ్ల వైసిపిపాలనలో మహిళల అదృశ్యంపై టిడిపి ఎంపీలు బీకే పార్థసారథి, లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు.గణాంకాలతో సహా వివరించారు. 2019 నుంచి 2024 వరకు..వైసిపి పాలనలో మహిళల అదృశ్యం, పోలీస్ విచారణలో తిరిగి గుర్తించడం వంటి అంశాలను ప్రస్తావించారు.

* వివరాలు వెల్లడించిన మంత్రి సంజయ్
2019లో మహిళల అదృశ్యంపై 6,896 ఫిర్యాదులు అందాయని.. వారిలో 6583 మందిని పోలీసులు గుర్తించారని మంత్రి వివరించారు. 2020లో 7576 ఫిర్యాదులకు గాను.. 7189 మంది ఆచూకీ గుర్తించారని.. 2021లో 10,085 ఫిర్యాదులకు గాను 9616 మందిని పోలీసులు గుర్తించారు. 2022లో 10433 ఫిర్యాదులు రాగా
.. 10994 మందిని పోలీసులు గుర్తించినట్లు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధ్రువీకరిస్తూ లిఖితపూర్వకంగా సమాధానము ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన దిశ యాప్ గురించి కూడా ప్రస్తావించడం విశేషం. ఆ యాప్ అందుబాటులోకి ఉండడంతో త్వరితగతిన బాధితులు ఫిర్యాదు చేయగలిగారని చెప్పుకొచ్చారు.

* వైసీపీకి ప్రచారాస్త్రం
కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో వైసీపీకి ఇది వరంగా మారింది. ఆ పార్టీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకోవడం ప్రారంభించింది. లేనిపోని ఆరోపణలతో నాడు వైసిపి ప్రభుత్వాన్ని పవన్ టార్గెట్ చేసుకున్నారని.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తోంది. మొత్తానికైతే కేంద్రం మహిళల అదృశ్యం విషయంలో స్పష్టత ఇవ్వడంతో.. పవన్ ఇరకాటంలో పడినట్లు అయ్యింది. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.