TDP Cadre Clarity: మొన్నటి ఎన్నికల్లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఒకవైపు జనసేనతో.. మరోవైపు బిజెపితో కలిసి ప్రయాణం చేసింది. అధికారంలోకి రాగలిగింది. కానీ గౌరవం ఇచ్చిపుచ్చుకున్న క్రమంలో.. టిడిపి నుంచి ఆ రెండు పార్టీలకు తగినంతగా లభించడం లేదన్న విమర్శలు వచ్చాయి. గత రెండేళ్లుగా చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా ఉండేది. నాయకుల నుంచి క్యాడర్ వరకు అదే పరిస్థితి. అయితే దానిని తప్పు పట్టేవారు సీఎం చంద్రబాబు. కూటమిలోని మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించేవారు. జనసేనతో పాటు బిజెపిని గౌరవించాల్సిందేనని పార్టీ క్యాడర్కు తేల్చి చెప్పేవారు. మొన్ననే తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గాల ప్రమాణస్వీకారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఎవరికి ఇష్టం లేకున్నా జనసేనతో వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. కొందరు సీనియర్లకు వ్యక్తిగత అభిప్రాయం ఉండవచ్చు కానీ.. కూటమి విషయంలో మాత్రం ఆలోచన ఒకే మాదిరిగా ఉండాలంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో టీడీపీ క్యాడర్ కు స్పష్టమైన అవగాహన వచ్చింది.
* చంద్రబాబు సీరియస్ యాక్షన్..
కూటమి క్రమశిక్షణ విషయంలో సైతం చంద్రబాబు సీరియస్ యాక్షన్ లోకి దిగారు. కూటమిలో విభేదాలకు కారణమవుతున్న పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ వర్మ పై వేటు వేశారు. పిఠాపురం వర్మ క్యాడర్ తో మమేకమై పనిచేసే నేత. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలుపు కోసం కృషి చేశారు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత పదేపదే జనసేనతో గొడవలు పెట్టుకుంటున్నారు. ప్రోటోకాల్ అంటూ.. ఫోటోలు పెట్టడం లేదంటూ ఏవేవో సాకులు చూపుతున్నారు. ఆయన వైఖరిలో తేడా కనిపిస్తోంది. అలాగని బలమైన నాయకుడు. అలా రెండు సంవత్సరాల పాటు ఆయన చర్యలను గమనించారు చంద్రబాబు. రోజురోజుకు శృతిమిస్తుండడంతో ఆయనను ఇన్చార్జి పదవి నుంచి తొలగించారు. ఇది ఒక రకంగా షాకింగ్ పరిణామమే. కానీ ఈ ఒక్క ఘటనతో వర్మలా కూటమిలో విభేదించే నాయకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
* అతిపెద్ద పార్టీగా..
తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ. 30 నుంచి 40 శాతం ఓటు బ్యాంకు కలిగిన పార్టీ. సహజంగానే క్షేత్రస్థాయిలో అంత బలం లేకపోయే బిజెపి, జనసేన విషయంలో టిడిపికి భిన్న వైఖరి ఉంటుంది. అయితే కూటమి ద్వారా ముందుకు వెళితేనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రారు. కేంద్రంలో బిజెపి సహకారం ఉంటేనే ఏపీలో కూటమి సవ్యంగా ముందుకు సాగుతుంది. అందుకే చంద్రబాబు సైతం బిజెపి కోసం తెలంగాణలోనే పార్టీని అలానే విడిచిపెట్టారు. కేవలం జగన్మోహన్ రెడ్డిని మరోసారి అధికారంలోకి రాకుండా చూసేందుకే టిడిపి నాయకత్వం ఆ ప్రయత్నాల్లో ఉంది. అయితే వరుసగా జరుగుతున్న పరిణామాలతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు స్పష్టత వచ్చింది. ఈ విషయంలో పూర్తి అవగాహన రావడంతో ఇకనుంచి అసంతృప్త స్వరాలు పెద్దగా వినిపించవు.
