Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం పై బిగ్ అప్డేట్ వచ్చింది. పథకం అమలు తేదీ పై ఒక క్లారిటీ వస్తోంది. అదే రోజున తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఒక్కో నిర్ణయం తీసుకుంటోంది. ఈనెల 12న విద్యాసంస్థలు తెరుచుకోనున్న సంగతి తెలిసిందే. దాదాపు 50 రోజుల విరామం తర్వాత పాఠశాలలు తెరవనున్నాయి. అయితే ఈ నెల 12న పాఠశాలలు తెరిచిన రోజు తల్లికి వందనం నిధులు జమ అవుతాయని అంతా భావించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే మాత్రం ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరోవైపు విద్యార్థులకు ఇచ్చే కిట్ల పంపిణీకి కూడా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే పాఠశాలలు మాత్రం యధావిధిగా ఈ నెల 12న ప్రారంభం కానున్నాయి.
* ఎప్పటి నుంచో కసరత్తు…
తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎప్పటినుంచో కసరత్తు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. సచివాలయాల వారీగా సర్వే కూడా చేసింది. విద్యాశాఖకు వచ్చిన వివరాలను సచివాలయాల వారీగా సరిపోల్చుతూ ఈ సర్వే కొనసాగింది. హౌస్ మ్యాపింగ్ తో పాటు ఇతరత్రా వివరాలను అందులో సరిపోల్చారు. ఈ ప్రక్రియ జాప్యం జరగడంతో ఈ నెల 19న తల్లికి వందనం నిధులు జమ చేస్తారని అంతా భావించారు. మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి అదే రోజు నిధులు జమకు ఆలోచన జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా నిధుల జమ జూలై మొదటి వారంలో చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే ఈ పథకం అమలు చేశారు. కానీ ఈ ఏడాది మాత్రం వచ్చే నెల మొదటి వారంలో అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* పెరిగిన లబ్ధిదారులు..
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది 67.27 లక్షల మందికి పథకం వర్తించగా… ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షలు గా గుర్తించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఎంత మంది చదువుకుంటే అంత మందికి ఈ పథకం అమలు చేస్తున్నారు. గత ఏడాది మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారమే ఈ ఏడాది కూడా పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నిధులు వేరువేరుగా అందజేయనుంది. ఈ పథకానికి గాను సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి. విద్యా సంవత్సరం ప్రకారం ఈ నెల 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా సెలవులు పొడిగిస్తారు అన్న ప్రచారం సాగింది. ఉపాధ్యాయ సంఘాలు కూడా విజ్ఞప్తి చేశాయి. కానీ ప్రభుత్వం మాత్రం 12నే బడులు తెరవాలని ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు యుద్ధం కారణంగా విద్యార్థి మిత్ర కిట్ల తయారీలో కొంత జాప్యం జరిగింది. ఆ ప్రభావం పంపిణీ పై పడింది.

