Talliki Vandanam Scheme: ఏపీలో తల్లికి వందనం పథకం పై బిగ్ అప్డేట్ వచ్చింది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం కింద నగదు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు షెడ్యూల్ మారినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల వివరాలను సచివాలయ సిబ్బంది సేకరిస్తున్నారు. తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పారదర్శకంగా అమలు చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అందుకే తల్లికి వందనం నిధుల జమకు సంబంధించి తేదీ మార్పు అనివార్యంగా మారింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై వారం రోజుల్లోగా నిధులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.
* విద్యార్థుల వివరాలతో సర్వే..
రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అందుతోంది. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ వద్ద ఉన్న వివరాలు సచివాలయాల వారీగా పంపించారు. అక్కడ సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆరా తీస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం సాయం అందనుంది. ఈసారి అనర్హులకు అందకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వే చేపడుతోంది. పాఠశాల విద్యా శాఖ వద్ద ఉన్న వివరాలను సచివాలయాలకు పంపించి.. పరిశీలనలో కఠిన మార్గదర్శకాలు అమలు చేస్తోంది. 60 లక్షల మంది లబ్ధిదారులు ఉండడంతో వారి వివరాల సేకరణలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అందుకే తల్లికి వందనం నిధుల జమ ఈనెల 12 నుంచి 19 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
* ఈనెల 19న జమ..
వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు ఈనెల 12న తెరుచుకోనున్నాయి. అదేరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో పుస్తకాల కిట్లు అందించనున్నారు. పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు కూడా అందిస్తారు. యూనిఫారం తో పాటు ఇతర పరికరాలు అందిస్తారు. అదే రోజు తల్లికి వందనం నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ క్షేత్రస్థాయిలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల వివరాలు సేకరించే సర్వేలో జాప్యం జరుగుతోంది. పూర్తి సర్వేలో వివరాలు సేకరించిన తర్వాత.. కేవలం అర్హులుకు మాత్రమే అందేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈనెల 19 నాటికి అటు ఇటుగా తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ఖాయం.
