AP Elections 2024
AP Elections 2024: ఏపీలో ఎన్నికల అల్లర్లపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. 13 మంది అధికారులతో నిన్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు అయ్యింది. పల్నాడు, మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ ఫోకస్ పెంచింది. దీంతో హింసాత్మక ఘటనలకు కారణమైన నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
* పల్నాడులో ఎన్నికల పోలింగ్ నుంచి చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. సిట్ ఏర్పాటుకు ముందే ఇక్కడి నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే వారిని హౌస్ అరెస్ట్ చేసినా.. తప్పించుకొని మరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో కొందరు హైదరాబాద్ కు, మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
* రాయలసీమలో సైతం పోలింగ్ ముందు నుంచే హింసాత్మక ఘటనలు జరిగాయి. వాటిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ ఘటనలకు బాధ్యులను చేస్తూ చాలామంది అధికారులపై వేటు పడింది. శాఖపరమైన విచారణ కూడా కొనసాగుతోంది.
* అయితే తాజా పరిణామాలతో రాయలసీమకు చెందిన నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. విచారణ సవ్యంగా సాగితే మాత్రం చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను అరెస్టు చేసే ఛాన్స్ కనిపిస్తోంది.
* మరోవైపు హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరిపి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు పరుగులు పెడుతున్నారు. సాయంత్రానికి నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో చాలామంది నేతలు భయపడుతున్నారు. తమ పేర్లు బయటకు వస్తే పరిస్థితి ఏంటి? అన్నది వారిని వేధిస్తోంది. అరెస్టులు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.