Sharmila-Jagan assets : మొత్తంగా జగన్, షర్మిల మధ్య ఆస్తుల గోల సమస్య పోయిందని.. వివాదం పరిష్కారమైందని.. ఆంధ్రజ్యోతి కథనం ద్వారా బయటి ప్రపంచానికి తెలిసింది. ఈమధ్య ఏ విషయమైనా షర్మిల రాధాకృష్ణతో పంచుకుంటున్నారు. వాళ్ల కుటుంబంలో ఏం జరిగినా వెంటనే చెప్పేస్తున్నారు. దాన్ని రాధాకృష్ణ బొంబాట్ అనుకుంటూ ప్రచురిస్తున్నారు. అయితే గతంలో షర్మిల విషయంలో రాధాకృష్ణ ప్రచురించిన వార్తలు మొత్తం నిజమయ్యాయి. ఆమె రాజకీయ ప్రవేశం నాటి నుంచి.. ప్రత్యేక పార్టీ పెట్టేదాకా.. దానిని కాంగ్రెస్ లో కలిపే వ్యవహారం.. ఇవన్నీ కూడా వాస్తవ రూపం దాల్చాయి. అయితే షర్మిల – జగన్ మధ్య వివాదాలు పరిష్కారం దిశగా వచ్చాయని.. ఆస్తుల పంపకాలు జరిగిపోతున్నాయని అనంతగిరి రాధాకృష్ణ రాసినవన్నీ ఇప్పుడు సత్య దూరాలుగా మిగిలిపోయిన పారిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంపకాలకు సంబంధించి తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కేసు దాఖలు చేశారు. గత నెలలోనే జగన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వచ్చే నెలలో విచారణ జరిగే అవకాశం ఉంది. జగన్ వ్యవహరించిన ఈ తీరు ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చర్చకు దారి తీస్తోంది.
అందువల్లే వివాదం
ఆస్తుల పంపకాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని రాధాకృష్ణ రాసిన నేపథ్యంలో.. అవన్నీ కూడా సత్య దూరమని తెలుస్తోంది. అయితే షర్మిల – జగన్ మధ్య అభిమానానికి అసలు కారణం సరస్వతి కంపెనీ. వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సరస్వతి అనే పవర్ కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీ పేరుతో పల్నాడులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని.. ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తక్కువ మొత్తానికే భూములను పొందారు. ఆ కంపెనీలో షేర్లను షర్మిల, విజయమ్మ పేరు మీద కేటాయించారు. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఆ షేర్లను తన తల్లి అక్రమంగా తన చెల్లికి బదలాయించిందని ఆరోపించారు. ఆ పేర్లు తనకు ఇవ్వాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను జగన్ ఆశ్రయించారు. అంటే ఈ ప్రకారం జగన్మోహన్ రెడ్డి విజయమ్మ, షర్మిలపై నేరుగా పంచాయతీకి దిగినట్టు తెలుస్తోంది.
పేపర్ల మీద మాత్రమే ఉంది
సరస్వతి పవర్ అనే కంపెనీ పేపర్ల మీద మాత్రమే ఉందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ కంపెనీ పేరు మీద భూములు మాత్రమే ఉన్నాయని, ఉత్పత్తి, ఆదాయం లేవని ఆరోపిస్తున్నారు. భూములు కంపెనీ పేరు మీద నాడు జగన్మోహన్ రెడ్డి తక్కువ ధరకు కొనుగోలు చేశారని టిడిపి నాయకులు అంటున్నారు. అయితే సరస్వతి కంపెనీ షేర్లకు సంబంధించి జగన్ చేసిన ఫిర్యాదులో చాలా సంచలన విషయాలున్నాయి.”ఆ కంపెనీని అభివృద్ధిలోకి తీసుకొచ్చాం. ఆ ఫలాలు మొత్తం మాకు మాత్రమే దక్కాలని” జగన్మోహన్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ నీళ్లు, గనులను సరస్వతి పవర్ కంపెనీ కోసం కేటాయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దానినే ఆయన అభివృద్ధిగా చెప్పుకుంటున్నారని టిడిపి నాయకులు అంటున్నారు.. ఇప్పటికీ సరస్వతీ పవర్ కంపెనీకి భూములు ఇచ్చిన వారికి జగన్మోహన్ రెడ్డి ఉపాధి కల్పించలేదని టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు.