TTD Issue  : సుప్రీంకోర్టులో లడ్డూ వివాదం.. కేంద్రం సంచలన నిర్ణయం

గత కొద్ది రోజులుగా తిరుపతి లడ్డూ వివాదం కొనసాగుతూనే ఉంది. సీరియల్ మాదిరిగా విస్తరిస్తూనే ఉంది. ఈ తరుణంలో ఈరోజు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.

Written By: Dharma, Updated On : October 3, 2024 11:35 am

TTD Tirumala Laddu Controversy

Follow us on

TTD Issue  : తిరుమల లడ్డు వివాదంలో బిజెపి ఎలా స్పందిస్తుంది? టిడిపి కూటమి ప్రభుత్వం ఆరోపణలను బలపరుస్తుందా?లేకుంటే వ్యతిరేకిస్తుందా? ఇప్పుడు అంతటా ఇదే చర్చ. దేశవ్యాప్తంగా దుమారానికి కారణమైన ఈ ఘటన విషయంలో కేంద్రం వైఖరి ఏంటి అన్నది ప్రశ్నగా మిగిలింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈరోజు విచారణ జరగనుంది. కేంద్రం తన అభిప్రాయాన్ని చెప్పాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. సుప్రీంకోర్టు హాట్ కామెంట్స్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సిట్ విచారణ సైతం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం సిబిఐ విచారణకు సిద్ధమని కోర్టుకు చెబుతుందా? లేకుంటే కోర్టు నిర్ణయానికే వదిలేస్తుందా? అనేది ఈరోజు మధ్యాహ్నానికి స్పష్టత రానుంది. లడ్డు వివాదం పై ఉన్నత స్థాయి విచారణ జరగాలని కోరుతూ వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి, బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్ ల పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ వివాదంపై సిట్ విచారణ ప్రారంభమైంది.అయితే ఆ విచారణ సరిపోతుందా? లేకుంటే మరో విచారణ వేయాలా? అనే దానిపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది కోర్టు. ఈరోజు మధ్యాహ్నం ఈ విషయంపై కేంద్రం స్పష్టత ఇవ్వనుంది. అయితే కేంద్రం ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ.

* సిట్ విచారణ నిలిపివేత
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిట్ విచారణను నిలిపివేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని భావిస్తోంది. అందుకే కేంద్రం సిట్ విచారణను కొనసాగించాలని కోరి అవకాశం లేదు. అదే సమయంలో సిబిఐ విచారణకు ముందుకు వస్తుందన్నది కూడా అనుమానమే.ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వంలో బిజెపి భాగస్వామి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టిడిపి కీలక భాగస్వామి. అందుకే ఈ విషయంలో టిడిపికి వ్యతిరేకంగా వెళ్లేందుకు ఛాన్స్ లేదు. అయితే టిడిపి కంటే.. కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో సిబిఐ విచారణకు కేంద్రం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

* ఇరకాటంలో కేంద్రం
కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిని తప్పు పట్టింది. ఆ వ్యాఖ్యలతో ఏపీ ప్రభుత్వం సైతం ఇరకాటంలో పడింది. ఈ తరుణంలో కేంద్రం ఈ అంశం జోలికి వచ్చి చేతులు కాల్చుకోవాలని అనుకోదు. అందుకే కేంద్రం విచారణపై నిర్ణయాధికారాన్ని కోర్టుకే విడిచి పెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి అయితే లడ్డు వివాదం నేపథ్యంలో కేంద్రంలో ఉన్న అధికార బిజెపి సంకోచంలో ఉంది. మరి కోర్టుకు కేంద్రం ఏం చెబుతుందో అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.