Rohini Karthe weather impact: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి భానుడు విరుచుకుపడుతున్నాడు. మధ్యాహ్నం కి తీవ్ర రూపం దాల్చుతున్నాడు. రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అయితే ఈ ఏడాది సంక్రాంతి తర్వాత ఎండల తీవ్రత క్రమేపి పెరుగుతూ వచ్చింది. మధ్యలో వర్షాల వార్తలు వచ్చిన వాటి జాడలేదు. కానీ ఇప్పుడు మార్చి రెండో వారంలోకి ప్రవేశించిన తరుణంలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. 40 డిగ్రీలు దాటుతుండడంతో ప్రమాద హెచ్చరికలు కనిపిస్తున్నాయి. నడి వేసవిలో ఇంతకంటే ఎక్కువ తీవ్రత ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉగాది తర్వాత పరిస్థితి తీవ్రతరం అవుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. భారత వాతావరణ శాఖ సైతం రాష్ట్రాలను హెచ్చరిస్తుండడం.. అందులో తెలుగు రాష్ట్రాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
40 డిగ్రీలకు దాటుతున్న ఉష్ణోగ్రత..
ఏప్రిల్ తో పాటు మే నెలలో ఎండల తీవ్రత అనేది విపరీతంగా ఉంటుంది. జూన్లో వర్షాలు ప్రారంభమవుతాయి. అదే సమయంలో ఉక్కపోత తీవ్రంగా ఉంటుంది. అయితే ఇప్పుడే 40 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటుతోంది. రానున్న కాలంలో 48 డిగ్రీల దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. ముఖ్యంగా రోహిణి కార్తెలో భానుడు ఉగ్రరూపం దాల్చడం ఖాయమన్న ఆందోళన సర్వత్రా ఉంది. ఈ ఏడాది వేసవి అత్యంత తీవ్రతతో ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మూల్యం చెల్లించుకోవడం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెరుగుతున్న ఎండ తీవ్రత..
ఏపీలో గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పతాక స్థాయికి చేరాయి. 40 డిగ్రీలు దాటాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాటితో పోల్చుకుంటే ఉత్తరాంధ్రలో ఉష్ణోగ్రతలు కొంత తక్కువే. అయితే వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు ఎండ తీవ్రత పెరగడంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. మరోవైపు తెలంగాణలో ఈనెల 15 నుంచి రెండు రోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. కానీ ఏపీలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని చెప్పడంతో వేసవి ఇబ్బందులు తప్పవని ప్రజలు ఆందోళనతో ఉన్నారు.
