Revanth Reddy Vs Pawan Kalyan: సాధారణంగా రాజకీయాలలో కొందరి మధ్య వైరం అనేది అంత ఈజీగా సాధ్యం కాదు. ఎందుకంటే వారి మధ్య అటువంటి వ్యవహారాలు ఎప్పుడూ చోటు చేసుకోవు కాబట్టి.. ప్రజలు ఆ విధంగా ఆలోచించరు. కానీ తెలంగాణలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి.. ఎవరు ఊహించని విధంగా.. కలలో కూడా అనుకోని విధంగా రాజకీయ వైరం ఏర్పడింది. అది కాస్త ఒక రకమైన సంచలనానికి దారితీసింది. ఇది ఎటువైపు వెళుతుంది.. దేని వైపు దారితీస్తుందో చూడాలి.
ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటల తర్వాత.. అది రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనం సృష్టించిన తర్వాత.. ఈ ఎపిసోడ్లోకి కాంగ్రెస్ నాయకులు వచ్చేసారు. ఆ విశ్లేషకుడిని బాధిత పక్షం లాగా చూపించేందుకు ప్రయత్నాలు చేశారు. ముందుగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఈ వ్యవహారంలోకి ప్రవేశించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని.. డిమాండ్ చేశారు. ఆ తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజి స్టార్ అంటూ మండిపడ్డారు. ఇక టీఆర్ఎస్ అధినేత్రి పళ్లు రాలుతాయి అంటూ పవన్ కళ్యాణ్ మీద మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కళ్యాణ్ బిజెపి, బీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన వ్యక్తి అని.. ఆయన ఒక ప్యాకెజిస్టార్ అంటూ ఆరోపించారు..
ఈ పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలను పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఎప్పుడైతే హస్తం పార్టీ నాయకులు తనమీద విమర్శలు చేయడం మొదలుపెట్టారో ఆయన నేరుగా రంగంలోకి దిగారు. అంతేకాదు.. తెలంగాణలోని గచ్చిబౌలి ప్రాంతంలో సంధ్య కన్వెన్షన్ హాల్ లో అంతర్గత సమావేశం నిర్వహించుకుంటామని తెలంగాణ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కు హ్యాండ్ ఇచ్చింది. దీనికి తెలంగాణ పోలీసులు చెప్పిన కారణమేంటంటే.. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద జనసేన నాయకులు విమర్శలు చేయడం ద్వారా.. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది.. తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహంగా ఉన్నారు.. అందువల్ల ఈ సమావేశానికి అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో జన సేన అధినేత తన గృహం నుంచి విలేకరుల సమావేశం నిర్వహించారు. చాలా ఆవేశంగా మాట్లాడారు. తాను ఇక్కడ పోటీ చేసే విషయం మీద స్పష్టత ఇచ్చారు. పోరాటల పురిటిగడ్డలో ఎందుకు సమావేశంనిర్వహిస్తున్న విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చారు. జనసేన అధినేత మీద కవిత ఆరోపణలు చేస్తే ఒక రకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపు కావాలి. అందువల్లే ఆమె అలా చేస్తుందనుకోవచ్చు. భారత రాష్ట్ర సమితి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే.. దాన్ని కూడా ఒక రకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితికి ఆంధ్రా ప్రాంతం మీద.. అక్కడి రాజకీయ నాయకుల మీద విమర్శలు చేస్తేనే ఆ పార్టీకి మనుగడ. అదే గనుక లేకపోతే ఆ పార్టీకి తెలంగాణలో కొనసాగింపు ఉండదు.
భారత రాష్ట్ర సమితి నుంచి కవిత వరకు ఏపీ డిప్యూటీ సీఎం మీద విమర్శలు చేశారంటే దాని వెనక ఒక అర్థం ఉంది. కానీ కాంగ్రెస్ నాయకులు ఈ స్థాయిలో జనసేన అధినేత మీద విమర్శలు చేయడం నిజంగా ఆశ్చర్యం. రేవంత్ రెడ్డి ఆదేశాల లేకుండా వారు ఇలా చేశారనుకోవడానికి లేదు. కానీ ఈ ఉద్దేశ్యాలు ఆశించి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విమర్శలు చేస్తుందో అర్థం కావడం లేదు..
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం. అలాంటప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రగిలితేనే ఓట్లు పడతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందువల్లే జనసేన అధినేత మీద ఈ స్థాయిలో విమర్శలు చేసినట్టు కనిపిస్తోంది. కానీ హైదరాబాదులో సెటిలర్ ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే..ఆంధ్రా వాదం మీద ఆరోపణలు చేస్తే అప్పుడు ఆ ఓట్లు వేరే పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని జనసేనాని స్పష్టం చేశారు. అలాంటప్పుడు కాంగ్రెస్ ఎందుకు అతడిని టార్గెట్ చేసినట్టు.. కాంగ్రెస్ జాతీయ పార్టీ.. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు చేస్తోంది. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో రేవంత్ ఇలాంటి వైఖరి ఎందుకు తీసుకున్నారు.. భారత రాష్ట్ర సమితికి అవకాశం ఇవ్వకూడదనా.. పవన్ కళ్యాణ్ వస్తే భారత రాష్ట్ర సమితికి ప్రయోజనం దక్కుతుందనా.. ఈ ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులు వేస్తున్నారు.. ఒకవేళ ఇదే విధానం కనుక రేవంత్ రెడ్డిది అయితే.. ఆయన ముందుగానే మేల్కొన్నట్టు..
కానీ, గత ఎన్నికల్లో సెటిలర్ ఓటర్లు భారత రాష్ట్ర సమితి వైపు మొగ్గు చూపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో రేవంత్ రెడ్డి కొనసాగించిన వైఖరి వల్ల వారి ఓట్లు ఎటువైపు వెళ్తాయో చూడాల్సి ఉంది. కాకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్న వ్యాఖ్యల ద్వారా గోటితో పోయే వ్యవహారాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చారు. అయితే ఇది ఎక్కడదాకా దారి తీస్తుందో చూడాల్సి ఉంది.
