AP Rajya Sabha Seats: రాజ్యసభ పదవులపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. జూన్లో ఓ నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో వాటి ఎన్నికకు కసరత్తు ప్రారంభించింది ఎన్నికల కమిషన్. వచ్చే నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇలా ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలు కూటమికి దక్కనున్నాయి. అయితే ఈ నాలుగు పదవుల పంపకాలపై కూటమి పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మూడు పార్టీల అభ్యర్థులపై స్పష్టత కూడా వస్తోంది. ప్రధానంగా జనసేన నుంచి ఒకరికి ఛాన్స్ దక్కనుంది. ఎవరికి అవకాశం అన్నదానిపై పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి అదనంగా ఒక పదవి ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు సమాచారం.
* వచ్చే నెల షెడ్యూల్..
రాష్ట్రం నుంచి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని, టిడిపికి చెందిన సానా సతీష్ పదవి విరమణ చేయనున్నారు. అలా ఖాళీలు అవుతున్న స్థానాలకు సంబంధించి భర్తీ చేసేందుకు ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల కమిషన్. వచ్చే నెలలో దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. టిడిపికి చెందిన సానా సతీష్ మరోసారి రెన్యువల్ కానున్నారు. మిగిలిన మూడు పదవులను మూడు పార్టీలు సమానంగా పంచుకొని ఉన్నాయి. బిజెపి నుంచి ఇప్పటికే ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టిడిపి నుంచి ఎస్సీ లేదా బీసీ నేతకు అవకాశం ఇస్తారు. పోలిట్ బ్యూరోలో ఉన్న ఇద్దరు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనిపైనే దృష్టిపెట్టారు చంద్రబాబు. పార్టీలో అందరి అభిప్రాయాన్ని తీసుకొని ఒక నిర్ణయానికి రానున్నారు.
* జనసేన నుంచి కొత్త పేరు..
ఇంకోవైపు జనసేన( janasena ) సైతం రాజ్యసభ పదవికి ఒక నేత పేరు ఖరారు చేసినట్లు ప్రచారం నడుస్తోంది. జనసేన నుంచి మొదట మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే గతసారి ఆయనకు రాజ్యసభ పదవి వచ్చినట్టే వచ్చి జారింది. అయితే ఆయనను మంత్రి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎమ్మెల్సీగా కూడా చేశారు. అయితే ఈసారి కొత్త వ్యక్తికి రాజ్యసభ పదవి ఇస్తారని తెలుస్తోంది జనసేన నుంచి. ప్రముఖంగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు వినిపిస్తోంది. మరోవైపు అల్లు అరవింద్ కు సైతం చాన్స్ ఇస్తారని కూడా టాక్ నడుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.