Raghurama Krishna Raju on Sakshi: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సమీపంలో ఎన్నికలు లేకపోయినా.. రాజకీయ ఎత్తుకు పైఎత్తులు మాత్రం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పార్టీలకంటే మీడియా దూకుడుగా ఉంది. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడుతోంది. కేవలం రాజకీయ ప్రేరేపితంతోనే మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే తన ప్రతిష్టకు భంగం కలిగిస్తూ సాక్షి మీడియాలో కథనాలు వస్తున్నాయి అంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
అప్పట్లో సంచలనం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణంరాజు( raghurama Krishnam Raju ) 2019లో. కొద్ది రోజులకే పార్టీ నాయకత్వంతో విభేదించారు. అప్పట్లో కస్టోడియల్ టార్చర్ వ్యవహారం పెను దుమారానికి దారితీసింది. పూర్తిగా వైసిపికి దూరమైన రఘురామకృష్ణం రాజు గడిచిన ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. ఆ పార్టీ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. అయితే రఘురామకృష్ణంరాజును టార్గెట్ చేసుకుని సాక్షి మీడియాలో కథనాలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఆయన సాక్షి మీడియా గ్రూపు పై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.
ఆ కథనాలతో..
గత కొద్దిరోజులుగా రఘురామకృష్ణం రాజు పై సాక్షి మీడియాలో ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. అందుకే ఆయన పరువు నష్టం దావా వేశారు. అలా కోటి రూపాయలు వస్తే అమరావతి రైతులకు విరాళంగా అందిస్తానని ప్రకటించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా.. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తన పరువు తీసేలా వరుస కథనాలు ప్రచురిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఇందిరా టెలివిజన్ ఎండి భారతీ రెడ్డి, ఎడిటర్, బ్యూరో చీఫ్, బోర్డు డైరెక్టర్లకు లీగల్ నోటీసులు పంపారు. తనకు బే షరతుగా క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు.. నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని.. వాటిని అమరావతి రైతులకు అందించాలని ఆ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇటీవల ఓ టిడిపి సీనియర్ రఘురామకృష్ణం రాజు పై సంచలన ఆరోపణలు చేశారు. దానిని ఆసరాగా చేసుకుని సాక్షి మీడియాలో రఘురామకృష్ణం రాజుకు వ్యతిరేకంగా కథనం వచ్చింది. అందుకే ఇప్పుడు నోటీసులు పంపించారు రఘురామకృష్ణంరాజు. మున్ముందు ఈ కేసుకు సంబంధించిన పరిణామాలు ఎలా ముందుకు సాగుతాయో చూడాలి.