Homeఆంధ్రప్రదేశ్‌Purandeshwari : ఢిల్లీకి పురందేశ్వరి.. ఆ నేతలకు గ్రీన్ సిగ్నల్!

Purandeshwari : ఢిల్లీకి పురందేశ్వరి.. ఆ నేతలకు గ్రీన్ సిగ్నల్!

Purandeshwari : భారతీయ జనతా పార్టీలో( Bhartiya Janata Party) భారీగా చేరికలు ఉన్నాయా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన చాలామంది నేతలు బిజెపిలో చేరుతారా? బిజెపి హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అందుకే రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీ వెళ్లారా? అకస్మాత్తుగా ఆమె హస్తిన ఎందుకు వెళ్లారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే హాట్ టాపిక్. వైసీపీకి చాలామంది నేతలు గుడ్ బై చెప్పారు. అందులో కొంతమంది మాత్రమే కూటమి పార్టీల్లో చేరారు. ప్రధానంగా తెలుగుదేశంతో పాటు జనసేనలోకి ఎక్కువమంది వెళ్లారు. ఆ రెండు పార్టీలతో పోల్చుకుంటే బిజెపిలో చేరిన నేతలు తక్కువ. దీనిపై బిజెపి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. అందుకే పురందేశ్వరికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. చేరికలకు యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకే ఆమెను ఢిల్లీ పిలిపించినట్లు సమాచారం.

* చాలామంది నేతల ఎదురుచూపు
వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి చాలామంది నేతలు దూరమయ్యారు. అందులో కీలక నేతలు సైతం ఉన్నారు. పార్టీలో నెంబర్ 2 గా ఎదిగిన విజయసాయిరెడ్డి లాంటివారు రాజీనామా చేయడం వెనుక బిజెపి హస్తము ఉందన్న ఆరోపణ ఉంది. అయితే ఓ అయిదుగురు ఎమ్మెల్సీలు సైతం పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ చాలా రోజుల కిందట పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఇటువంటి నేతలంతా కూటమి పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి వెళ్లలేని నేతలు చాలామంది జనసేనలో చేరారు. ఆ రెండు పార్టీల్లో చేరలేని నాయకులు బిజెపి కోసం ఎదురుచూస్తున్నారు. కానీ బిజెపి నాయకత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకుండా పోయింది. అందుకే నేరుగా హై కమాండ్ తో మాట్లాడిన వారు ఉన్నారు. అటువంటి వారి కోసం చర్చించేందుకు పురందేశ్వరికి ఢిల్లీ పిలుపు వచ్చినట్లు సమాచారం.

* హుటాహుటిన ఢిల్లీకి పురందేశ్వరి
అయితే ఉన్నఫలంగా ఢిల్లీ ( Delhi) నుంచి పిలుపు రావడంతో పురందేశ్వరి వెళ్లారు. దీంతో రకరకాల చర్చ నడుస్తోంది. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది బిజెపిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలతో వారిని పార్టీ రాష్ట్ర నాయకత్వం చేర్చుకోవడం లేదు. దీనిపై ఢిల్లీ పెద్దలు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలోకి స్వచ్ఛందంగా చేరుతామనుకున్న నాయకులను ఆహ్వానించకపోవడం ఏమిటనేది బిజెపి పెద్దల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. అయితే కూటమి మధ్య సమన్వయంతో ముందుకు సాగడం కోసమే వారి చేరికల విషయంలో పెండింగ్ పెట్టినట్లు రాష్ట్ర నాయకత్వం చెబుతోంది.

* బిజెపి ఎదిగేందుకు ఇదే మంచి సమయం
ఏపీలో( Andhra Pradesh) బిజెపి ఎదిగేందుకు ఇదే మంచి సమయమని హైకమాండ్ భావిస్తోంది. కానీ రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదని అంచనాకు వచ్చింది. మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్ష మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. పురందేశ్వరి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా పదవి చేపట్టి రెండేళ్లవుతోంది. అందుకే అధ్యక్ష బాధ్యతలు వేరొకరికి అప్పగించాలని హైకమాండ్ భావిస్తోంది. ఆ నిర్ణయం తీసుకునేందుకే పురందేశ్వరి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. పార్టీ చేరికల విషయంలో సైతం ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కూటమితో సమన్వయం చేసుకొని ఎటువంటి అభ్యంతరాలు లేని నేతలను చేర్చుకునేందుకు ప్లాన్ రూపొందించినట్లు సమాచారం. మొత్తానికి అయితే పురందేశ్వరి ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే బిజెపిలో పరిణామాలు శరవేగంగా మారుతాయని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో??

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular