Professor Nageshwar Latest News: ఏపీ రాజకీయాల్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసాయి. పోలీస్ కేసుల వరకు నమోదయ్యాయి. దీంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు బహిరంగంగానే చెప్పుకున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఈ తరుణంలో ఆయనకు మద్దతు లభిస్తోంది. ప్రకాష్ రాజు లాంటి వారు మద్దతు తెలిపారు. సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడుస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన సందర్భంలో జరిగిన పరిణామాలు ఇవి అంటూ బయటపెట్టారు ప్రొఫెసర్ నాగేశ్వర్. చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు అని.. జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు అని.. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళొద్దని క్లాస్ పీకినట్లు చెప్పారు నాగేశ్వర్. ఇది పెద్ద దుమారానికి దారితీసింది. జనసైనికులు ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టారు. దీంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు నాగేశ్వర్.
తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు..
మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా మద్దతు లభిస్తుండగా.. కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాత్రం సంచలన ఆరోపణలు చేశారు. నాగేశ్వర్ అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించడం విశేషం. 10టీవీ షేర్ల బదిలీ లో భారీగా అవినీతి జరిగిందని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అదే విషయాన్ని ఒకరోజు ముందుగానే చెప్పారు తీన్మార్ మల్లన్న. అయితే తీన్మార్ మల్లన్న పై పరువు నష్టం దావా వేస్తానంటూ వేరే వ్యక్తుల ద్వారా సమాచారం ఇచ్చారు ప్రొఫెసర్ నాగేశ్వర్. దానిపై తీన్మార్ మల్లన్న సవాల్ చేశారు. దమ్ముంటే తనపై పరువు నష్టం దావా వేయాలంటూ సూచించారు. అంతకుమించి ఏమీ జరగదని.. తనపై ఒక కేసు మాత్రమే పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఒకవైపు అయితే.. మరోవైపు తీన్మార్ మల్లన్న ఆరోపణలు సంచలనంగా మారాయి.
పేదవారి సొమ్ము దోపిడి..
10టీవీ పేరుతో ప్రొఫెసర్ నాగేశ్వర్ పేదవాళ్ల సొమ్ము తిన్నారని మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ దీనిపై విచారణ జరిగితే ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను తాను అందిస్తారని పేర్కొన్నారు. దమ్ముంటే నాగేశ్వర్ విచారణకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. ఒకవైపు ఏపీలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్స్ రాజకీయ ప్రకంపనలు రేపుతుండగా.. తెలంగాణలో అదే నాగేశ్వర్ ను టార్గెట్ చేసుకుని తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ సెగలు పుట్టిస్తున్నాయి. ఇంకోవైపు నటుడు ప్రకాష్ రాజ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతుగా నిలిచారు. ఇంకోవైపు సిపిఐ నారాయణ అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ ను సీఎం క్యాండిడేట్ గా అభివర్ణించారు. మొత్తానికైతే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. రాజకీయ విశ్లేషకుడు కాస్త.. రాజకీయ వివాదాస్పద ముద్ర వేసుకున్నారు. అయితే యుద్ధం వారు ప్రారంభించారు. ముగింపు తాను ఇస్తానని టిడిపి తో పాటు జనసేన పై వ్యాఖ్యానించారు ప్రొఫెసర్ నాగేశ్వర్.
