Pawan Kalyan – Amit Shah : కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ తర్వాత.. స్థానంలో ఉన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఏపీలో కూడా చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో పవన్ కళ్యాణ్.. కేంద్రంలో అమిత్ షా ఇద్దరు కూడా అత్యంత శక్తివంతమైన నాయకులు. వీరిద్దరికి బలమైన నేపథ్యం ఉంది. అన్నింటికి మించి జాతీయ భావాలు పుష్కలంగా ఉన్నాయి. వీరిద్దరిది ఒకే మనస్తత్వం. శైలికూడా ఒకే విధంగా ఉంటుంది. దేశం ముఖ్యమా.. ప్రాణాలు ముఖ్యమా అంటే వీరిద్దరూ మొదటి దానికి ఓటు వేస్తారు.
అంతటి జాతీయత భావాలు ఉన్న వీరిద్దరూ కలవడం ఏపీ రాజకీయాలలోనే కాదు, దేశ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమిత్ షా పెద్దగా ఎవరితో మాట్లాడటం లేదు. పైగా పశ్చిమ బెంగాల్లో సిలిగురి కారిడార్ లో చేపడుతున్న పనులపై నిత్యం సమీక్షలు చేస్తున్నారు.. ఈశాన్య రాష్ట్రాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అలాంటి అమిత్ షా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ వెంట ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఏకంగా 25 నిమిషాల పాటు చర్చ జరిగింది. అనేక అంశాలపై ఈ సమావేశంలో మాట్లాడారని తెలుస్తోంది. అమిత్ షా తో సమావేశం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి నవ్వుతూ కనిపించారు. అధ్యంతం మీటింగ్ అద్భుతంగా సాగిందని పేర్కొన్నారు.
ఇప్పటికిప్పుడు అమిత్ షా, పవన్ కళ్యాణ్ భేటీ వెనుక అసలు ఉద్దేశం 2029 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో బిజెపి, జనసేన, టిడిపి కలిసి పోటీ చేయడమేనని బయటకు లీకులు ఇచ్చారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి 2024 లో బంపర్ మెజారిటీతో విజయం సాధించాయి. వైసిపిని 11 స్థానాలకు పరిమితం చేశాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో అభివృద్ధి.. సంక్షేమం.. ప్రజల భద్రత.. రాజకీయంగా స్థిరత్వం వంటివి కొనసాగాలంటే ఈ మూడు పార్టీలు 2029 ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ అమిత్ షా కు సూచనలు చేసినట్టు బయట చెప్పారు.. దీనికి అమిత్ షా కూడా ఒప్పుకున్నట్టు సమాచారం.
2024 లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు.. దానికంటే ముందు జనసేన, టిడిపి, బిజెపి పార్టీలు కలిసి పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ చొరవ చూపించారు. బిజెపి పెద్దలతో మాట్లాడారు. పొత్తు కుదిరేలా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. అందువల్ల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. అయితే ఇప్పుడు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. వైసిపిని అధికారానికి దూరంగా ఉంచాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందువల్లే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ బిజెపి పెద్దలతో అసలు విషయం చెప్పేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాటను బిజెపి పెద్దలు కూడా కాదనలేకపోతున్నారు. ఆయన చెప్పిన దానికి ఓకే అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గురువారం కూడా ఢిల్లీలోనే ఉంటారు. ఎన్డీఏ ప్రభుత్వంలోని కీలక మంత్రులను.. ఇంకా కొంతమంది పెద్ద వ్యక్తులను కలిసే అవకాశం ఉంది.
– కుహాన మేధావుల వాదన ఇదీ..
అయితే అమిత్ షాతో పవన్ భేటి వెనుక బీజేపీ, జనసేన లీకులు అన్నీ టీడీపీకి అనుకూలంగానే ఉన్నాయి. మూడు పార్టీలు కలిసినడిచేటట్టుగానే ఉన్నాయి. అయితే మన తెలుగులో ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారు దీనిపై కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందంగా కొత్త లాజిక్ వెతుకుతున్నారు.. జగన్ ను కేంద్రంలోని బీజేపీ అరెస్ట్ చేస్తే ఖాళీ అయ్యే ఆ స్థానంలో జనసేనను ప్రతిపక్షంగా పెట్టొచ్చని.. లేదంటే బీజేపీతో కలిసి జనసేన సపరేట్ గా పోటీచేసినా గెలవచ్చొని.. ఈ రెండూ కాదంటే పవనే బీజేపీలో చేరి లీడ్ చేయవచ్చని నాగేశ్వర్ లాంటి మేధావులు ఇప్పటికే సోషల్ మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు , వీడియోలు పరిచేస్తున్నారు.
అయితే లోగొట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టు.. కేంద్ర హోంమంత్రి బీజేపీలో నంబర్ 2 అయిన అమిత్ షా ఆ గుట్టు విప్పరు.. జనసేనాని పవన్ బయటకు చెప్పరు… ఏం జరిగింది? భవిష్యత్తులో ఏం జరుగబోతోందన్నది వారిద్దరికే తెలుసు. కానీ బయట మాత్రం కొందరు కూటమిలో ఈ భేటి ద్వారా బాగానే పుల్లలు పెట్టే ప్లాన్లు చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ భేటి ప్రభావం ఎంతనేది భవిష్యత్తులోనే తేలనుంది..
