IAS Praveen Prakash
IAS Praveen Prakash: ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ తీసుకున్నారు. ఏడేళ్లు సర్వీస్ ఉన్నా స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిఎస్ నిరబ్ కుమార్ ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. గత నెల 25న ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ఇంకా ఆయనకు ఏడేళ్ల పాటు సర్వీస్ ఉంది. అయినా సరే స్వచ్ఛంద పదవీ విరమణ పొందడం ఆశ్చర్యం వేస్తోంది. చర్చనీయాంశంగా మారింది. ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుందని సిఎస్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రవీణ్ ప్రకాష్ కు ఆదేశాలు ఇచ్చింది. ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ కు దరఖాస్తు చేయడంతో వివాదం రేగింది. ఆయన దరఖాస్తులో సంతకం చేయకుండా డిజిటల్ సంతకం పెట్టారు. ఈ సంతకం చెల్లదని ప్రభుత్వం చెప్పడంతో మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఆయనకు గత నెల 19న బదిలీ చేశారు. కానీ ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో సైతం హల్చల్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా చేశారు. కృష్ణా నదితో పాటు ఆయన నివాసం ఉండే విల్లా, దేవాలయం వద్ద హిందీ పాటలకు అభినయిస్తూ వీడియోలు హల్చల్ చేశాయి.
వైసిపి ప్రభుత్వంతో అంటగాకారన్న విమర్శ ప్రవీణ్ ప్రకాష్ పై ఉంది.కొన్ని టెండర్లు, కాంట్రాక్టుల విషయంలో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉపాధ్యాయులతో పాటు విద్యాశాఖ అధికారులను బెదిరించారన్న విమర్శలు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ వైపు అడుగులు వేస్తారని ప్రచారం జరిగింది. మరోవైపు సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికల బరిలో దిగుతారని కూడా ప్రచారం జోరుగా నడిచింది. కానీ ఆయన వీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం విశేషం.