Vemireddy Prasanthi Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మహిళా నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పై వ్యక్తిగత కామెంట్స్ చేశారు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్. దానిపై చాలా రకాలుగా విమర్శలు వచ్చాయి. కానీ పార్టీ అధినేత అమర్నాథ్ ను సమర్థిస్తూ మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం అభ్యంతరకరంగా ఉన్నాయి. మరోసారి నెల్లూరు జిల్లాలో రచ్చకు దారి తీసే అవకాశం ఉంది.
ప్రశాంతి రెడ్డి గెలుపు..
మొన్నటి ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి పై గెలిచారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ప్రసన్న కుమార్ రెడ్డి. తప్పకుండా గెలుస్తానన్నచోట ఓడిపోవడంతో ఆయనకు షాక్ తగిలింది. ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రమే కాదు నెల్లూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థులంతా ఓడిపోయారు. పార్టీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. అటువంటి చోట వైసిపి ఓడిపోవడానికి ప్రధాన కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆగ్రహంగా ఉంది. అందుకే వేమిరెడ్డి దంపతులు అంటేనే వైసీపీ నేతలకు పూనకం వచ్చేలా ఉంది. వారిని ఉద్దేశించి దారుణంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
నిత్యం రాజకీయ వేడి..
కోవూరు నియోజకవర్గ నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలిచిన తరువాత ఒక రకమైన రాజకీయ వేడి కనిపిస్తోంది. అక్కడ ఓడిపోయిన మనస్థాపనతో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై వ్యక్తిగత కామెంట్లకు దిగుతున్నారు. గతంలో ఆమె వ్యక్తిగత జీవితం మాట్లాడేసరికి పెద్ద రచ్చ జరిగింది. ఏకంగా వేమిరెడ్డి అనుచరులు ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ధ్వంసం చేశారు. అయితే అప్పట్లో కవ్వింపు చర్యలు చేపట్టడం వల్లే ఆ ఘటన జరిగింది. అయితే ఇప్పుడు కూడా మరోసారి ప్రసన్నకుమార్ రెడ్డి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటనలు చేస్తున్నారు. ఆమెను ఉద్దేశించి సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అంటూ సంబోధిస్తూ విమర్శలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి.
సోమిరెడ్డి అంటూ సంబోధన..
సోమిరెడ్డి కుటుంబంతో ప్రసన్నకుమార్ రెడ్డికి బంధుత్వం ఉంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సమీప బంధువు ప్రసన్నకుమార్ రెడ్డి. అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరుడిని ప్రశాంతి రెడ్డి వివాహం చేసుకున్నారు. కానీ సోమిరెడ్డి సోదరుడు అకాల మృతి చెందారు. దీంతో ప్రశాంతి రెడ్డి ప్రభాకర్ రెడ్డిని వివాహం ఆడారు. అయితే తనపై గెలిచిన ప్రశాంతి రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటూ ఇబ్బంది పెట్టేలా మాట్లాడారు. మరి దీనిపై వేమిరెడ్డి దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.
