Prashna Ravan : నోరు ఉందని పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదు. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగకూడదు. రాజ్యాంగం హక్కులు ఇచ్చింది కదా అని వాటిని వేరే వాటికోసం వాడకూడదు. ఎందుకంటే స్వేచ్ఛకు ఒక హద్దు ఉంటుంది. మాటకు ఒక పరిమితి ఉంటుంది. ఎదుటి వ్యక్తిని విమర్శించడానికి ఒక గీత ఉంటుంది. ఇవన్నీ దాటి.. కోట్ల మంది నమ్మకాలను తిట్టి.. గొప్పగా ఎదిగిపోతామంటే ఈ దేశంలో కుదరదు. ఎందుకంటే మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతింటే అప్పుడు.. పరిస్థితి మరో విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే స్థితిని ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలి కూర జోసెఫ్ అనుభవిస్తున్నాడు.
ప్రశ్నించే రావణ్ మీద ఉపా చట్టం కింద రాజాద్రోహం సెక్షన్ నమోదయింది. వాస్తవానికి ఈ పరిణామాన్ని ఏపీలో ఎవరూ ఊహించలేదు. రావణ్ తన యూట్యూబ్లో చేసిన వీడియోలను చూస్తే అతడు ఏ స్థాయిలో ఉన్మాదంతో ఉన్నాడో అర్థమవుతుంది. రాముడిని తిట్టాడు. సీతను తిట్టాడు. రామాయణాన్ని అడ్డగోలుగా దూషించాడు. మహాభారతాన్ని మరో విధంగా వెల్లడించాడు. అందులో ఉన్న దేవతామూర్తులను కూడా తీవ్రంగా కించపరిచాడు. అక్కడితోనే ఆగలేదు మరింత దారుణంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.. భారతీయ జనతా పార్టీ.. రాధా మనోహర్.. వంటి వారిని రాయడానికి వీలు లేని భాషలో దూషించాడు. ఇక పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నైతే ఘోరంగా దూషించాడు.
రావణ్ మీద రాజ ద్రోహం కేసు నమోదు అయిన తర్వాత తర్వాతి టార్గెట్ ఎవరు.. తర్వాత ఆ కేసు నమోదు ఎవరిమీద అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు లభిస్తున్న ఒకే ఒక సమాధానం ప్రకాష్ రాజ్. ఎందుకంటే అతను సనాతన ధర్మానికి పూర్తిగా వ్యతిరేకి. ధర్మస్థల కుట్ర వెనుక కూడా అతని పేరు వినిపించింది. ఇప్పుడు యూట్యూబ్ రావణ్ వెనుక కూడా తనే ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. చివరికి ఈమధ్య కాక్రోచ్ జనతా పార్టీ కి తెర వెనుక కూడా ప్రకాష్ రాజ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పటికీ అతడు హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. యాంటీ నేషనల్ గా ఎక్స్పోజ్ అవుతున్నాడు. రావణ్ ను అరెస్ట్ చేసినట్టుగానే.. ప్రకాష్ రాజ్ ను కూడా అరెస్ట్ చేస్తారా.. ఏపీ ప్రభుత్వానికి ఆస్థాయి ఉందా.. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఆల్ రేంజ్ లో స్వేచ్ఛ ఇవ్వగలుగుతాడా.. ఇప్పుడు ఇదే ప్రశ్న వ్యక్తం అవుతుంది.
జనసేన ఎమ్మెల్యే, ఏపీ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా రంగంలోకి దిగి రావణ్ మీద.. అప్పటి వెనుక ఉన్న ప్రకాష్ రాజ్ మీద ఆరోపణలు చేశారు. కందుల దుర్గేష్ సౌమ్యుడు. అటువంటి వ్యక్తి ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం అంటే మామూలు విషయం కాదు. దీని వెనక జనసేన పెద్ద పవన్ కళ్యాణ్ లేడు అనుకోవడానికి లేదు..” ప్రకాష్ రాజ్ రావణ్ వెనుక ఉన్నాడు. వీరి వెనక కుట్ర దారులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో భారీగా కులాల మధ్య.. మతాల మధ్య ఘర్షణలు రేపడానికి కుట్ర చేస్తున్నారు.. ఈ మంటల్లో వెచ్చదనాన్ని పొందడానికి తాడేపల్లి సిద్ధంగా ఉంది. అసలు ఆ ఆలోచనలను.. ఆ ప్రయత్నాలను మొత్తం బయటపెడతామని..” దుర్గేష్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఒక కీలకమైన ఆడియోను కూడా విలేకరుల ముందు ఉంచారు.. ఈ వ్యవహారంలో వైసిపికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాత్ర ఉందని దుర్గేష్ ఆరోపిస్తున్నారు..
జోసెఫ్ మీద వరుసగా కేసు నమోదు అవుతూనే ఉన్నాయి.. బెయిళ్లు వస్తూనే ఉన్నాయి. అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి.. ఇంకా ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలియదు. కానీ తనను అనవసరంగా గెలికితే పరిణామాలు ఇదే విధంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ పరోక్షంగా హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది.. వాస్తవానికి రావణ్ మీద మామూలు సెక్షన్లు పెడితే బెయిల్ వస్తోంది. అందువల్లే పోలీసులు ఏకంగా 152 సెక్షన్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆ సెక్షన్ గనుక నమోదు చేస్తే బెయిల్ రావడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఆ కేసు నిరూపణ గనక జరిగితే శిక్ష ఒక రేంజ్ లో ఉంటుంది.. గతంలో 124a సెక్షన్ అమల్లో ఉండేది. దాని ప్లేస్ లో కొత్త సెక్షన్ నమోదు కాకపోయినప్పటికీ.. విధించే శిక్ష అదే స్థాయిలో ఉంటుంది. దీని ప్రకారం వారెంట్ లేకపోయినప్పటికీ అరెస్టు చేయవచ్చు. ఒకవేళ నేరం నిరూపణ జరిగితే లైఫ్ టైం జైల్లో ఉండాలి. లేదా ఏడు సంవత్సరాల పాటు జైల్లో ఉండాలి. ఇప్పటికే రావణ్ మీద గన్నవరం పోలీసులు ఉపా 13, 19 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 152 సెక్షన్ గురించి తెలియాల్సి ఉంది.
ఈ వ్యవహారంలో ప్రధానంగా తెరపైకి వస్తున్న ప్రశ్న.. ప్రకాష్ రాజ్, జోసెఫ్ కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారని ఏపీ మంత్రి ఆరోపిస్తున్నారు. వీళ్ళ వెనక ఉన్న వ్యక్తులను.. శక్తులను బయటపెడతామని ఆయన అంటున్నారు. మరి జోసెఫ్ మీద ఉపా సెక్షన్లను ప్రయోగిస్తారా.. ప్రకాష్ రాజ్ కు కూడా ఇదే వర్తిస్తుందా.. పవన్ ఆ ధైర్యం చేస్తాడా.. చంద్రబాబు స్వేచ్ఛ ఇస్తాడా.. చూడాలి మరి ఏం జరుగుతుందో.

