AP Elections 2024: విచిత్రమో.. యాదృచ్ఛికమో.. తెలియదు కానీ.. ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనల సమయంలో విధ్వంసాలు చోటు చేసుకుంటున్నాయి. ఓసారి ఆయన విదేశీ పర్యటన సమయంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా తగలబడింది. మరోసారి ఆయన ఫారిన్ టూర్ లో ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్టు జరిగింది. పోలింగ్ తరువాత ఆయన లండన్ వెళ్లడంతో విధ్వంసకర ఘటనలు కొనసాగుతున్నాయి. దీంతో విపక్షాలకు ఇదో విమర్శన అస్త్రంగా మారింది. ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా పోలీస్ శాఖ అలర్ట్ ప్రకటించడంతో.. లండన్ నుంచి జగన్ ప్లాన్ చేస్తున్నట్లు టిడిపి ఆరోపిస్తోంది.
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ తర్వాత విధ్వంసకర ఘటనలు చోటు చేసుకుంటాయని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. పోలింగ్ కు ముందు, పోలింగ్ తర్వాత ఏ స్థాయిలో ఘటనలు జరిగాయో అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఎలక్షన్ కమిషన్ అలర్ట్ అయింది. ఏపీ పోలీస్ శాఖకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర బలగాలు సైతం మొహరించాయి. వచ్చే నెల 19 వరకు రాష్ట్రంలో కొనసాగనున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ విధ్వంసాలకు ప్లాన్ చేశారో..స్పష్టమైన సమాచారం కేంద్ర నిఘా సంస్థల వద్ద ఉంది. అందుకే నేరుగా పోలీసులు వెళ్లి అక్కడే తనిఖీలు చేస్తున్నారు. మారణాయుధాలు కోసం వెతుకుతున్నారు. మూడు రోజుల్లో 300 చోట్ల తనిఖీలు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అయితే గత ఐదేళ్ల కాలంలో కొన్ని పరిమిత నియోజకవర్గాల్లో మాత్రమే అల్లర్లు జరిగాయి. పోలింగ్ నాడు కూడా.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వంటి వారి నియోజకవర్గాల్లోనే గొడవలు జరిగాయి. విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ నేతలంతా జగన్ కు అత్యంత సన్నిహితులు. జగన్ మనసెరిగినవారు. సీఎం జగన్ లండన్ టూర్ లో ఉండగా వీరి నియోజకవర్గాల్లో మాత్రమే విధ్వంసాలు జరగడం.. అనుమానాలకు తావిస్తోంది. సరిగ్గా టిడిపి సైతం ఇదే తరహా ఆరోపణలు చేస్తోంది. ఏపీలో విధ్వంశాలకు లండన్ లో పధక రచన జరిగిందన్నది టిడిపి నుంచి వస్తున్న ఆరోపణ. అయితే ఇది మున్ముందు వైసీపీని ఆత్మరక్షణలో పడేసే అంశం. ఆ పార్టీ నేతలను కేసులకు గురి చేసే అంశంగా మారడం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అది ఎన్నికల్లో గెలుపొటములపై ఆధారపడి ఉంటుంది.