Pithapuram Varma YSRCP strategy: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి సరైన అస్త్రం దొరికింది. పిఠాపురం వర్మపై టిడిపి వేటు వేయడంతో.. ఇక వైసిపి సోషల్ మీడియాకు చేతినిండా పని దొరికింది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో విచ్ఛిన్నం తెచ్చేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. అయితే గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించారు. ఇప్పుడు అదే పరిస్థితిని తెచ్చి కూటమిలో విభేదాలు తెచ్చేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు సహజంగానే చేస్తుంది. ఇప్పటికే కృష్ణ జిల్లాలో ఒకరు లైన్ దాటి మాట్లాడుతున్నారు. పిఠాపురంలో సైతం వర్మ అలానే వ్యవహరిస్తున్నారు.. తాను కచ్చితంగా గెలిచే నియోజకవర్గం అనే ఆవేదన ఆయనలో ఉంటుంది. అది సహజం కూడా. అయితే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగుతుంది కూడా. ఇటువంటి సమయంలో సహకరించాల్సింది పోయి వర్మ స్వతంత్రంగా ముందుకు వెళ్తున్నారు. ఆయన కోణంలో అది తప్పు లేదు కానీ.. కూటమిపరంగా మాత్రం ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అందుకే టిడిపి నాయకత్వం వర్మపై వేటు వేసినట్లు తెలుస్తోంది.
ఇటీవలే నారా లోకేష్ తో భేటీ..
పిఠాపురం నియోజకవర్గం కావాలా? లేకుంటే మంచి రాజకీయ భవిష్యత్తు కావాలా? అని టిడిపి హై కమాండ్ వర్మను కోరినట్లు తెలుస్తోంది. మూడు రోజుల కిందట వర్మ నారా లోకేష్ ను ప్రత్యేకంగా కలిశారు. ఆ తరువాత ఇప్పుడు వర్మను తొలగిస్తూ పర్యవేక్షణకు గాను ముగ్గురు సభ్యులతో కూడిన టిడిపి కమిటీని ఏర్పాటు చేశారు. కచ్చితంగా వర్మకు చెప్పి.. ఒప్పించి మరి ఆయనను తప్పించి ఉంటారన్న అనుమానాలు అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా కచ్చితంగా వర్మకు జరిగిన అన్యాయం పై డిబేట్ పెడుతుంది. టిడిపికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేయిస్తుంది.
వైసీపీలోకి వెళ్తారని ప్రచారం..
వాస్తవానికి గతంలోనే వర్మ వైసీపీలోకి వెళ్లిపోతారన్న ప్రచారం పతాక స్థాయిలో జరిగింది. కూటమి అధికారంలోకి రాగానే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అప్పట్లో హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చి నెలలు సంవత్సరాలు దాటుతున్న ఆయనకు ఎటువంటి పదవి లేకుండా పోయింది. దీంతో ఆయనలో అసహనం పెరిగిపోయిందని.. పదవి రాకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని.. అందుకే వర్మ వైసీపీలో చేరిపోతారని లేనిపోని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇదివరకే రాష్ట్ర కార్యవర్గంలోకి వర్మను తీసుకున్నారు. లోకేష్ ను కూడా వర్మ కలిశారు. ఆ తరువాత ఇంచార్జ్ పోస్టును తీసేసారు. వర్మ పిఠాపురం బాధ్యతలనుంచి తప్పుకుంటే కీలక పదవి కట్టబెట్టే హామీ లభించి ఉంటుంది అనేది పొలిటికల్ వర్గాల్లో ప్రచారం. త్వరలో వర్మను ఎమ్మెల్సీ చేస్తారని కూడా ఒక టాక్ ఉంది. అయితే టిడిపి ఇన్చార్జిగా మరో అధికార కేంద్రంగా పిఠాపురంలో మారకూడదని భావించి.. ఆయన అనుమతితోనే పదవి నుంచి తొలగించి ఉంటారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే వర్మకు పదవి తొలగించిన తర్వాత ఆయన స్పందించిన తీరుబట్టి ఒక అంచనాకు రావచ్చు.