Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan fan Murali Nayak: పవన్ కళ్యాణ్ సార్.. మా బిడ్డ ఆత్మకు శాంతి...

Pawan Kalyan fan Murali Nayak: పవన్ కళ్యాణ్ సార్.. మా బిడ్డ ఆత్మకు శాంతి చేకూర్చండి.. వీడియో వైరల్

Pawan Kalyan fan Murali Nayak: ఆపరేషన్ సింధూర్( operation sindoor ) సమయంలో వీరమరణం పొందాడు తెలుగు ఆర్మీ జవాన్ మురళి నాయక్. దేశం కోసం పోరాడుతూ పాతికేళ్ల వయసులోనే అమరుడు అయ్యాడు. ఆయన మరణించి ఏడాది పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తల్లిదండ్రులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. నేరుగా మిమ్మల్ని కలిసే అవకాశం తెలియకపోవడంతో సోషల్ మీడియా ద్వారా విన్నవించేందుకు ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరి హృదయాలను ద్రవింప చేస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితాండాకు చెందిన మురళి నాయక్ గత ఏడాది ఆపరేషన్ సింధూర్ లో వీరమరణం చెందాడు. ఏప్రిల్ 14న స్వగ్రామంలో వైకుంఠ సమారాధన చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

పవన్ కళ్యాణ్ అంటే అభిమానం..
మురళి నాయక్ కు( Murali Nayak ) పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. జనసేన అంటే పిచ్చి. అదే సమయంలో సైన్యంలో చేరాలని కోరిక. ఈ క్రమంలోనే 2022 డిసెంబర్ 29న అగ్ని వీర్ జవాన్ గా సైన్యంలో చేరాడు. 851 లైట్ రెజిమెంట్ లో విధులు నిర్వహించేవాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆర్మీ అధికారులు మురళి నాయక్ ను నాసిక్ నుంచి జమ్మూ కాశ్మీర్ కు పిలిపించారు. సరిహద్దుల వద్ద చొరబాటుదారులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 2025 మే మొదటి వారంలో మురళి నాయక్ వీరమరణం పొందాడు. చిన్నప్పటినుంచి దేశభక్తి ఎక్కువ. అందుకే రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఆర్మీలో చేరాడు. దేశం కోసం ప్రాణాలు వదిలాడు. మురళి నాయక్ కు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అన్న విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం తెలుసుకున్నారు. అందుకే మురళి నాయక్ కు నివాళులు అర్పించేందుకు అప్పట్లో కల్లి తాండకు వచ్చారు పవన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల సాయం అందించారు. వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం ప్రకటించి అందించారు.

సోషల్ మీడియాలో వైరల్..
అయితే ఏప్రిల్ 14న మురళి నాయక్ సంవత్సరాదిని.. వైకుంఠ సమారాధన పేరిట నిర్వహించేందుకు తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ను( deputy CM Pawan Kalyan) ఆహ్వానించారు.’ పవన్ కళ్యాణ్ సార్.. మీరంటే మురళీకి చాలా అభిమానం.. ఇష్టం.. మీరు వస్తే మురళి ఆత్మ శాంతిస్తుంది. తప్పకుండా రండి సార్. మీ దగ్గరకు ఎలా రావాలో తెలియడం లేదు. అందుకే వీడియో షేర్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ సార్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ కు మీరు వచ్చి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాం’ అంటూ మురళి నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి వీడియోలో కోరారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version