Pawan Kalyan Amit Shah: పవన్ కళ్యాణ్ కు( AP deputy CM Pawan Kalyan ) బిజెపి పెద్ద బాధ్యత అప్పజెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. కీలక చర్చలు జరిపారు. అమిత్ షా కేవలం మంత్రి మాత్రమే కాదు. బిజెపి రాజకీయ వ్యూహకర్త. ఆపై బిజెపిలో ఆయన పాత్ర కీలకం. అయితే పవన్ ఢిల్లీ పర్యటనలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. అటువంటి పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి పిలిపించుకుని మరి కీలక బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే పవన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత తెలంగాణ బిజెపి నేతలు కలిశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన మద్దతును కోరారు. మద్దతు ఇవ్వడమే కాదు బిజెపి తరఫున ప్రచారానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమని ప్రకటించారు.
పరస్పర సహకారం..
వాస్తవానికి తెలంగాణలో( Telangana)) జనసేన పోటీ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పటివరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశారు. రామ్ తాళ్లూరి నేతృత్వంలో కొత్త కమిటీల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయింది. అందులో కొత్త వారికి అవకాశం ఇచ్చి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో యువతకు టికెట్లు ఇవ్వడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చారు. ప్రజాబలం ఉండి ప్రధాన రాజకీయ పార్టీల తరఫున టికెట్లు దొరకని వారికి జనసేన టికెట్లు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ప్రధాన నగరాలతో పాటు పట్టణాల్లో జనసేన అభ్యర్థులు పోటీకి దిగారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతు తెలపడంతో ఆ రెండు పార్టీల మధ్య ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఈనెల 7, 8 తేదీల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ఇక్కడ సక్సెస్ అయితే 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ముందుకెళ్లాలన్నది బిజెపి ప్రణాళికగా తెలుస్తోంది.
తమిళనాడులో ఎన్డీఏ ఇన్చార్జిగా..
మరోవైపు రెండు నెలల్లో తమిళనాడు ( Tamil Nadu )అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ఓటు శాతాన్ని పెంచుకుంది బిజెపి. సీట్ల పరంగా ఒక్క స్థానం రాకున్నా ఓట్లు మాత్రం గణనీయంగా పెరిగాయి. అందుకే ఈసారి అక్కడ పట్టు బిగించాలని బిజెపి చూస్తోంది. ఇప్పటికే పలని స్వామి నేతృత్వంలోని డీఎంకే ఎన్డీఏ లోకి వచ్చింది. దినకరన్ పార్టీ సైతం పొత్తుకు ముందుకు వచ్చింది. అయితే అనూహ్యంగా తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే 12 శాతం వరకు ఓట్లు సొంతం చేసుకుంటుందని సర్వేల్లో తేలుతోంది. అదంతా డిఎంకె కూటమి వ్యతిరేక ఓటు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే విజయ్ ను ఎన్డీఏలోకి తేవాలని బిజెపి పెద్దలు భావించారు. ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకంగా బిజెపి ఉండడంతో.. తనకు రాజకీయంగా ఇబ్బంది తప్పదని విజయ్ భయపడుతున్నారు. అందుకే ఎన్డీఏలో చేరేందుకు ఇష్టపడడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో బలమైన చరిష్మ కావాలి అంటే పవన్ అవసరం ఏర్పడింది బిజెపికి. పైగా అక్కడ తెలుగు వారి ప్రభావం ఎక్కువ. అందుకే పవన్ కళ్యాణ్ కు తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీఏ ఇన్చార్జిగా నియమించాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం.. తరువాత తమిళనాడు ఎన్డీఏ ఇన్చార్జిగా ప్రకటన ఉంటుందని ప్రచారం నడుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
