Pawan Delhi Tour : పవన్ ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్న వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీ, చివరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం ఎన్నెన్నో అనుమానపు చూపులు చూస్తోంది. అంతటా పవన్ నామస్మరణే కనిపిస్తోంది. పవన్ ఢిల్లీ పెద్దలతో ఏం చర్చిస్తారు? పవన్ ఏం చెబుతారు? దాని పర్యవసానాలు ఏపీ రాజకీయాల్లో ఎలా ఉంటాయి? అన్న చర్చలే నడుస్తున్నాయి. తనపై వ్యూహాలు ఎలా ఉంటాయో? అని అధికార వైసీపీ భయపడుతోంది. తనను పిలవకుండా జనసేనను పిలవడం ఏమిటన్న ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది. పవన్ తమపై ఎటువంటి ఫిర్యాదులు చేస్తారో రాష్ట్ర టీడీపీ నాయకులు భయపడుతున్నారు.
రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంటే వైసీపీకి లెక్కలేనితనం. గత నాలుగేళ్లుగా ఈ పరిస్థితిని చాలా సందర్భాల్లో చూసుంటాం. బీజేపీ అగ్రనేతలను గౌరవించి.. రాష్ట్ర నాయకులను మాత్రం బఫూన్లలా చూస్తూ వచ్చారు. ప్రజల్లో వైసీపీ, బీజేపీ అన్న భ్రమను కల్పించడంలో జగన్ అండ్ కో సక్సెస్ అయ్యింది. రాష్ట్ర నాయకత్వంలో సైతం తన అస్మదీయులను ఏర్పాటుచేసి ఎంతగా ఆడుకోవాలో అంతగా ఆడుకున్నారు. టీడీపీది అదే పరిస్థితి. బీజేపీతో చంద్రబాబు అడుకున్నట్టుగా ఎవరూ ఆడుకోలేదు. అవసరం వచ్చినప్పుడు బీజేపీ ప్రాపకం కోసం ప్రయత్నించడం.. అవసరం తీరాక ప్రజల్లో చులకన చేయడం ఆయనకు అలవాటైన విద్య. అందుకే ఎన్డీఏతో పనిచేసిన పార్టీలన్నింటికీ ఆహ్వానాలు అందించినా టీడీపీని మాత్రం బీజేపీ పక్కన పడేసింది.
అయితే ఇప్పుడు పవన్ ఎన్డీఏ సమావేశాలకు హాజరయ్యేసరికి తత్వం బోధపడింది. అధికార వైసీపీ బీజేపీ, జనసేనలు ఒక్కటేనని ఆరోపణలు మొదలుపెట్టాయి. బీజేపీ ఏపీ ప్రయోజనాల కోసం ఏం చేసిందని విజయసాయిరెడ్డి లాంటి వారు ప్రశ్నించగా.. మంత్రులు, వందీ మాగధులు పవన్ పై ఎదురుదాడికి దిగుతున్నారు. కక్కలేని మింగలేని స్థితిలో టీడీపీ కొట్టిమిట్టాడుతోంది. ఎలా స్పందించాలో తెలియక చంద్రబాబు అండ్ కో మల్లగుల్లాలు పడుతోంది. అయితే ఇన్నాళ్లూ పవన్ విషయంలో ఎలా ఉండాలో తెలియని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కొత్త స్వరం అందుకుంది. బీజేపీ, జనసేనకు మధ్య రాజకీయ వ్యూహం ఉందని చెప్పుకోవడం ప్రారంభించింది.
ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో పవన్ సెంటరాఫ్ అట్రాక్షన్ అన్నమాట. చంద్రబాబుకు పవన్ అవసరం అనివార్యం. అటు బీజేపీకి సైతం మరో ప్రత్యామ్నాయం లేదు. వెళితే వైసీపీతో వెళ్లాలి. కానీ అంత సాహసం చేయదు. పోనీ చంద్రబాబుతో దోస్తీ కడదామంటే గత అనుభవాలు భయపెడుతున్నాయి. అందుకే పవనే శరణ్యమన్న నిర్ణయానికి బీజేపీ వచ్చింది. ఎనలేని ప్రాధాన్యమిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చేందుకు చంద్రబాబును సైతం పక్కన పెట్టింది. తేల్చుకోవాల్సింది పవనే. అందుకే రేపటి ఎన్డీఏ సమావేశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఢిల్లీ వేదికగా పవన్ ఏదో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.