Patanjali investment in Uttarandhra: ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. పెట్టుబడులను చాలా వేగంగా ఆకర్షిస్తోంది. సింగిల్ విండోలో అనుమతులు, భూ కేటాయింపులు కూడా జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు పతాంజలి సంస్థ ముందుకు వచ్చింది. ఏపీ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తోంది. అది వచ్చిన మరుక్షణం తమ కార్యకలాపాలు మొదలు పెట్టాలని భావిస్తోంది. అదే జరిగితే ఉత్తరాంధ్రకు ఒక గేమ్ చేంజర్ గా నిలవనుంది పతాంజలి ఉత్పత్తుల సంస్థ.
దేశీయ ఆయుర్వేద ఉత్పత్తుల్లో..
దేశీయ ఆయుర్వేద ఉత్పత్తుల్లో పతాంజలి అగ్రగామిగా ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం పతాంజలి సంస్థ విన్నపం మేరకు విజయనగరం జిల్లా కొత్తవలసలో దాదాపు 171 ఎకరాల భూమిని కేటాయించింది. దాదాపు 370 కోట్ల రూపాయలతో పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తి సంస్థను ఏర్పాటు చేయాలని భావించింది. తద్వారా ప్రత్యక్షంగా రెండు వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అయితే అప్పట్లో ప్రతిపాదనల దశ దాటింది. కానీ ఇంతలో అధికారం మార్పిడి జరిగింది ఏపీలో. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పతాంజలి ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు.
మరోసారి ప్రతిపాదనలు..
తాజాగా పతాంజలి మరోసారి తమ ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే కొత్తవలస ప్రతిపాదిత స్థలంలో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తామని చెప్పింది. ప్రభుత్వం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు వస్తాయని భావిస్తోంది. 1000 కోట్ల రూపాయల వ్యయంతో ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు దిశగా అడుగులు వేస్తోంది పతాంజలి. ఆయుర్వేద వైద్యాన్ని మరింత అభివృద్ధి చేయడం, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ వంటి అంశాలను మరింత అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఇదే జరిగితే అటవీ ఉత్పత్తులను సేకరించే గిరిజనులకు, సాధారణ రైతులకు సంబంధించిన పంటలకు గిట్టుబాటు కలిగే అవకాశం ఉంది. వేలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మరింత మెరుగు పడనున్నాయన్నమాట.
