Rooster Fighting: వేల కోట్ల పందాలు.. సంక్రాంతి వేడుకలు మామూలుగా లేదుగా

కాకినాడ జిల్లాలో భోగి, సంక్రాంతి,కనుమ కు కోడిపందాలు, గుండాట వ్యాపారం ఏకంగా రూ. 450 కోట్లు దాటడం విశేషం. ఇందులో 200 కోట్ల రూపాయలు ఒక్క కనుమ రోజునే పందాలు కొనసాగాయి.

Written By: Dharma, Updated On : January 17, 2024 9:44 am

Rooster Fighting

Follow us on

Rooster Fighting: ఏపీలో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. వేల కోట్ల రూపాయల పందాలు కొనసాగాయి. ఎన్నికల ఏడాది కావడంతో వైసీపీ నేతలు దగ్గరుండి జూద శిబిరాలను నిర్వహించారు. గుండాట, పేకాట, కోడి పందాలను దగ్గరుండి నిర్వహించారు. పోలీసులు వీటిపై కన్నెత్తి చూడకుండా, ఒత్తిడి తీసుకొచ్చి మరి బెట్టింగ్ రాయుళ్లకు అండగా నిలబడ్డారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందలాది శిబిరాలు వెలిశాయి. వందల కోట్ల రూపాయల పందాలు కొనసాగాయి.

కాకినాడ జిల్లాలో భోగి, సంక్రాంతి,కనుమ కు కోడిపందాలు, గుండాట వ్యాపారం ఏకంగా రూ. 450 కోట్లు దాటడం విశేషం. ఇందులో 200 కోట్ల రూపాయలు ఒక్క కనుమ రోజునే పందాలు కొనసాగాయి. గుండాటే 250 కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా. అటు శిబిరాల నుంచి పోలీస్ స్టేషనులకు భారీగా లంచాలు వెళ్లినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలే మధ్యవర్తులుగా ఉండి పంపకాలు జరిపినట్లు సమాచారం.ముఖ్యంగా మంత్రులు,కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో కోడి పందాల బరులను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల డిజిటల్ లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

పందాలకు తమిళనాడు,కర్ణాటక, తెలంగాణ రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా హాజరయ్యారు. అటు మద్యం అమ్మకాలు కూడా కొనసాగాయి. కోనసీమలో అయితే అశ్లీల రికార్డ్ డాన్సులు సైతం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక శిబిరాల వద్ద చాలా చోట్ల సీఎం జగన్ ఫోటోతో కూడిన ఫ్లెక్సీలు కనిపించాయి. ఎక్కువగా అధికార పార్టీ నాయకుల హడావుడి కనిపించింది. ఎన్నికల ఏడాది కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం విశేషం. విందులు, వినోదాలతో బరుల వద్ద హైటెక్ హంగులు కల్పించారు. నరసాపురంలో అయితే వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తెగ హడావిడి చేశారు.

అటు కృష్ణా జిల్లాలో కోడి పందాలు జోరుగా కొనసాగాయి. మూడు రోజులపాటు 1000 కోట్లు లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. పొట్టేళ్ల పందాలు, పేకాట, గుండాటలు జోరుగా నిర్వహించారు. కోడి పందాల శిబిరాల వద్ద మంత్రిజోగి రమేష్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.ఉయ్యూరు మండలం బోల్లపాడులోని బరివత్త మంత్రి జోగి రమేష్ కేక్ కట్ చేశారు. అటు తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో సైతం కోడిపందాల శిబిరాలు కొనసాగాయి. పందెంలో ఓడిపోయిన కోళ్లకు భలే గిరాకీ ఏర్పడింది.అధిక ధరకు అమ్ముడయ్యాయి. ఒక్కో పుంజు 5000 వరకు ధర పలికింది. మొత్తానికైతే ఈ మూడు రోజులపాటు కోడిపందాల శిబిరాల వద్ద వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి.