Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh - YS Sharmila : అన్నాచెల్లెళ్ళయిన నారా లోకేష్, వైఎస్ షర్మిల.. జగన్...

Nara Lokesh – YS Sharmila : అన్నాచెల్లెళ్ళయిన నారా లోకేష్, వైఎస్ షర్మిల.. జగన్ కు ఇలా షాక్ తగిలిందేంటి?

Nara Lokesh YS Sharmila: రాజకీయాలు అన్నాకా పట్టు విడుపులు ఉండాలి. అస్తమానం కక్ష్యలు, కార్పాణ్యాలతో పెంచేసుకుని.. ఇష్టానుసారంగా విమర్శలు చేసుకుంటూ వెళ్తే సమాజంలో అశాంతి నెలకొంటుంది. ప్రజలు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటారు. విమర్శలు చేసుకున్న నాయకులు మాత్రం సేఫ్ గా ఉంటారు. అందుకే అక్కడదాకా పరిస్థితి వెళ్లకుండా.. రాజకీయ నాయకులు హుందాతనాన్ని ప్రదర్శించాలి. నిర్మాణాత్మక విధానంలో మాట్లాడాలి. చేసిన పనుల్లో, చేపట్టిన పథకాలలో ఏవైనా లోపాలుంటే విమర్శలు చేయాలి. అయితే ఇందులో ఎక్కడా కూడా కుటుంబ సభ్యులను తీసుకురావద్దు. అయితే దురదృష్టవశాత్తు ఏపీ రాజకీయాలలో నాయకులు కుటుంబాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంటారు. ఇందులో ఈ పార్టీ తక్కువ, ఆ పార్టీ ఎక్కువ అని లేదు. అయితే ఇందులో బాధిత పక్షంగా ఆడ మహిళా ప్రజాప్రతినిధులు ఉండడం విశేషం. అయితే ఇందులో ఏ మహిళా నాయకురాలికి కూడా మినహాయింపు లభించలేదు. అయితే ఇటీవల ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది మాత్రం వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం విశేషంగా కృషి చేసిన షర్మిల.. ఆమె కష్టానికి తగ్గట్టుగా పదవులను పొందడంలో విఫలమైంది. దీంతో జగన్ తో దూరం పెరిగింది. అంతిమంగా అది ఎవరి దారి వారు చూసుకునేదాకా చేరింది. ఈ క్రమంలో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. ఆ తర్వాత దాన్ని కాంగ్రెసులో విలీనం చేసింది. ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయింది. ఇటీవలి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. అయినప్పటికీ ఆమె ప్రత్యక్ష రాజకీయాలలో చురుకుగానే కనిపిస్తోంది.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల.. గట్టిగానే మాట్లాడుతున్నారు. జగన్ ప్రభుత్వం తప్పులను బయటపెడుతూ.. కూటమి నాయకుల పాలన విధానాన్ని కూడా ఎండగడుతున్నారు. మొత్తానికి ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో హుందాగానే వ్యవహరిస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ఆమె పై ప్రతిరోజు ఏదో రకమైన ఆరోపణ చేస్తోంది. అయితే వీటికి షర్మిల కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు.. అయితే టిడిపి సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా మాత్రం షర్మిల విషయంలో ఏమాత్రం విమర్శలు చేయడం లేదు. అయితే గతంలో ఆమెపై టిడిపి సోషల్ మీడియా విభాగం తీవ్రస్థాయిలోనే విమర్శలు చేసింది. అప్పట్లో జగన్ పక్కన షర్మిల ఉంది కాబట్టి.. టిడిపి నాయకులను నేరుగా ప్రశ్నించింది. కానీ ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిపోయిన నేపథ్యంలో షర్మిల ఒకపటిలాగా టిడిపి నాయకులను విమర్శించడం లేదు.

ఇక గురువారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ గవర్నర్ తేనీటీ విందును ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఏపీలోని రాజకీయ పార్టీ నాయకులందరూ హాజరయ్యారు. అందులో షర్మిల కూడా ఉన్నారు. తేనీటి విందుకు హాజరయ్యే క్రమంలో నారా లోకేష్, వైయస్ షర్మిల పరస్పరం ఎదురు పడ్డారు. ఇద్దరూ నమస్కరించుకున్నారు.. బాగున్నావా తల్లి అంటూ నారా లోకేష్ షర్మిలను కుశల ప్రశ్నలు అడిగితే.. బాగున్నా అన్న అంటూ షర్మిల బదులిచ్చారు. కొంతసేపు ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. అయితే ఈ దృశ్యాలను టిడిపి అనుకూల సోషల్ మీడియా విభాగం వారు తెగ ప్రచారం చేస్తున్నారు. ” షర్మిలకు నారా లోకేష్ రూపంలో ఒక సోదరుడు దొరికాడు. లోకేష్ కు కూడా షర్మిల రూపంలో ఒక సోదరి దొరికింది. వారిద్దరూ అన్నా చెల్లెళ్లయిపోయారు. ఇకపై వారిద్దరి సోదర సోదరీ బంధం మరింత దృఢంగా సాగుతుంది. ఇప్పుడు జగన్ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నారా లోకేశ్ – వైయస్ షర్మిల పరస్పరం నమస్కరించుకుంటున్న దృశ్యాలను తెగ వ్యాప్తి చేస్తున్నారు. అయితే వీటిపై వైసీపీ సోషల్ మీడియా విభాగం సరైన స్థాయిలో కౌంటర్ ఇస్తున్నప్పటికీ.. అది జనానికి అంతగా రుచించడం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version