Nara Lokesh new strategy: ఏపీలో( Andhra Pradesh) ఇప్పుడు ప్రతిష్టాత్మక నియోజకవర్గం మంగళగిరి. యువ నేత నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో రాష్ట్రంలోనే అభివృద్ధిలో దూసుకుపోతోంది. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంగళగిరి పై ఫుల్ ఫోకస్ పెట్టారు లోకేష్. అక్కడి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. వారితో కలిసి పని చేస్తున్నారు. లోకేష్ కు ఒక బలమైన నియోజకవర్గంగా మారింది మంగళగిరి. ఇటువంటి సమయంలో అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకోవాలంటే కష్టంగా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పాత నేతని తిరిగి లోకేష్ పై ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో ఓ బీసీ నేతపై గెలిచారు నారా లోకేష్. దాదాపు 90 వేల కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి సత్తా చాటారు.
టిడిపికి బలమైన నియోజకవర్గం..
కూటమికి బలమైన నియోజకవర్గాల సరసన మంగళగిరి( Mangalagiri) చేరింది. నారా లోకేష్ టిడిపికి బలమైన స్థానంగా మంగళగిరిని మార్చుతున్నారు. ఇటువంటి తరుణంలో మంగళగిరి పై దృష్టి పెట్టాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మరోసారి తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా జరిగారు.
చంద్రబాబు కేసుల విషయంలో..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు( CM Chandrababu) బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన పై నమోదైన అవినీతి కేసులు ఒక్కొక్కటి న్యాయస్థానంలో కొట్టివేతకు గురవుతూ వచ్చాయి. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. అయితే ఈ కేసులను విత్డ్రా చేసేందుకు సిఐడి ముందుకు వచ్చింది. అందుకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ఫిర్యాదుదారుగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సూచించింది. కానీ ఆయన ఈ కేసుల విషయంలో హైకోర్టును ఆశ్రయించడం చూస్తుంటే మాత్రం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యేందుకేనని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలిచారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. 2019లో ముఖ్యమంత్రి కుమారుడిగా, మంత్రిగా ఉన్న నారా లోకేష్ ను ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచారు. అటువంటి నేతను గడిచిన ఎన్నికల్లో పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అందుకే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు కేసుల విషయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి దూకుడుగా ముందుకు వెళుతుండడంతో.. ఆయననే మరోసారి లోకేష్ పై ప్రయోగించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..