Mudragada : ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైందా? ఈ నెలాఖరున ఆయన అధికార పార్టీ గూటికి చేరనున్నారా? ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రాయలసీమకు చెందిన సీనియర్ మంత్రి ముద్రగడను నేరుగా వైసీపీలో చేర్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తొలుత కుమారుడ్ని వైసీపీలోకి పంపించి తాను న్యూట్రల్ గా ఉండేందుకు ముద్రగడ మొగ్గుచూపారు. కానీ సదరు మంత్రి మాత్రం ముద్రగడనే నేరుగా వైసీపీలో చేర్పించేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం.
వారాహి యాత్రతో వైసీపీలో ఒక రకమైన అలజడి నెలకొంది. పవన్ టార్గెట్ చేయడంతో వైసీపీ నేతలు మైండ్ బ్లాక్ అయ్యింది. అటు కాపులంతా జనసేన వైపు పోలరైజ్ కావడంతో అధికార పార్టీలో అంతర్మథనం ప్రారంభమైంది. తొలుత విడిగా పోటీచేస్తానన్న పవన్ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ విముక్త ఏపీయే తన తుది లక్ష్యమని ప్రకటించడంతో ఆయన టీడీపీతో వెళ్లడం ఖాయమైంది. అదే జరిగితే టీడీపీ, జనసేన కూటమి వైపు కాపులు టర్న్ అవుతారని వైసీపీ అంచనా వేస్తోంది. అందుకే కాపుల్లో చీలిక తేవాలంటే నేరుగా ముద్రగడ రంగంలోకి దించడం అధికార పార్టీకి అనివార్యంగా మారింది.
రాయలసీమకు చెందిన సీనియర్ మంత్రి, ముద్రగడకు సమకాలికుడైన మంత్రికి జగన్ ఆ బాధ్యతలు అప్పగించారు. సదరు మంత్రి రంగంలోకి దిగి ముద్రగడను ఒప్పించినట్టు సమాచారం. అందుకే ముద్రగడ పవన్ పై లేఖాస్త్రాలకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ పవన్ విషయంలో జాగ్రత్తగా పడుతూ వస్తున్న ముద్రగడ పెద్ద సాహసమే చేశారు. ఏకంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన ద్వారపురెడ్డిని పణంగా పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేశారు.అందుకు కాపు సామాజికవర్గం నుంచి వ్యతిరేకతను చవిచూశారు. అయితే జగన్ మాత్రం కాపుల్లో కొద్దిపాటి బలన్ని ముద్రగడ ద్వారా ఓన్ చేసుకోవాలని చూశారు. అందుకే ముద్రగడకే ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
వాస్తవానికి ముద్రగడ పద్మనాభం విషయంలో కాపులో విచిత్రమైన వాదన ఉంది. టీడీపీ హయాంలో రిజర్వేషన్ ఉద్యమాన్ని పతాక శీర్షికకు తీసుకెళ్లిన ముద్రగడ జగన్ అధికారంలోకి రావడంతో నాకు ఉద్యమం వద్దు.. కాపులు వద్దంటూ అస్త్ర సన్యాసం చేశారు. దానికి తన వైపు అనుమానపు చూపులే కారణమని ముద్రగడ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే ముద్రగడ తనతో పాటు కుమారుడి రాజకీయం కోసం యూటర్న్ తీసుకున్నారు. అన్నింటికీ మించి పవన్ కు ఎదురెళ్లారు. ఏకంగా పిఠాపురం నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. అంటే ఆయన దాదాపు వైసీపీకి ఫిక్స్ అయినట్టే. అయితే సరైన ముహూర్తం చూసి ముందుగా కుమారుడ్ని పంపించనున్నారు. తరువాత తాను చేరనున్నారు.