Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా రుతుపవనాలు కదులుతున్నాయి. ఆ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నమోదు అయ్యాయి. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే ఇప్పటికే వర్షాలు ఆలస్యం అయ్యాయి. జూన్ రెండో వారంలో రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఇప్పుడు విస్తరణకు అవకాశం కలగడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి.
* ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు కొనసాగుతాయి. శుక్రవారం అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం, పశ్చిమగోదావరి, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాలో వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తుంది. వర్షం పడే సమయంలో ఈదురు గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని కూడా చెబుతోంది. ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో శుక్రవారం మోస్తరు వర్షాలు పడతాయని చెబుతోంది. గడిచిన 24 గంటల్లో పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలో 5.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. గుడివాడలో 3.5 సెంటీమీటర్లు, పార్వతీపురంలో 3.5, నరసాపురంలో 3.3, భీమడోలులో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రెండు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయింది.
* రాయలసీమలో సైతం..
వచ్చే మూడు రోజుల పాటు రాయలసీమలో సైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వర్షం పడే సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో.. వర్షాల తీవ్రత కూడా రాష్ట్రంలో పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఖరీఫ్ పనులు మరింత చురుగ్గా జరిపేందుకు ఛాన్స్ కలుగుతుంది రైతులకు. ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.
